పాండవుల మెట్ట
పాండవుల మెట్ట
కాకినాడ జిల్లా పెద్దాపురం చారిత్రాత్మకంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న పట్టణం. ఒకప్పుడు ఇక్కడ పట్టు బట్టలు నేసే చేనేత పని వారు ఉండేవారు. అది పెద్దాపురం సిల్క్ గా ప్రసిద్ధి చెందింది. అయితే సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో అనేక యంత్రాలతో తయారైన వస్త్రాలతో ఇవి పోటీ పడలేక మరుగున పడిపోయేయి. అయితే ఈ గ్రామంలో ఉన్న మరొక విశేషం మరిడమ్మ అమ్మవారి గుడి. ఆషాడ మాసంలో ఒక నెలరోజుల పాటు జరిగే తీర్థానికి అమ్మవారి జాతర్లకి చుట్టుపక్కల గ్రామాల నుండి ఎంతోమంది భక్తులు వచ్చి తమ మ్రొక్కులు తీర్చుకుంటారు. అలాగే ఇక్కడ ఒక సూర్యనారాయణమూర్తి దేవాలయం కూడా ఉంది.
ఆధ్యాత్మికంగా పెద్దాపురం ఈరకంగా ప్రాముఖ్యత సంతరించుకుంటే చారిత్రాత్మకంగా కూడా పెద్దాపురం చరిత్రలో నిలిచిపోయింది. అదే పాండవుల మెట్ట అనే స్థలం. ఇది మహాభారత కాలంలో అజ్ఞాతవాసo సమయంలో పాండవులు నివసించిన ప్రదేశంగా ప్రజలు విశ్వసిస్తారు. దానికి తగినట్లుగా కొన్ని ఆనవాళ్లు ఇక్కడ ఉన్నాయి. వాటిని పాండవుల గుహలు అంటారు. పూర్వకాలంలో పెద్దాపురం నుంచి రాజమండ్రి వరకు సొరంగ మార్గం ఉండేదని అది ప్రస్తుతం మూసి వేయబడిందని చెప్తుంటారు.
అలాగే ఈ కొండపై ఉన్న పెద్ద పాదముద్రని భీముని పాదముద్రగా విశ్వసిస్తారు. అలాగా ఈ గుట్టపై ఉండే మరొక ప్రదేశం ద్రౌపతి దేవి రజస్వల చాప. అంటే ద్రౌపది బహిష్టు సమయంలో ఈ చాప మీద కూర్చునే దని విశ్వాసం.
అలాగే ఈ పాండవుల మెట్ట మీద వివిధ రకాల దేవతల గుడులతోపాటు భీముని భార్య అయిన హి డిoబి గుడి కూడా ఉండడం చాలా అరుదైన విషయం.
పాండవుల మెట్ట పెద్దాపురం పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆటోలు టాక్సీలు ద్వారా ఈ ప్రదేశం చేరుకోవచ్చు. అయితే ఈ గుట్ట ఎక్కడానికి 108 మెట్లు ఎక్కవలసి ఉంటుంది .
ఈ ఊరిలో మరొక ప్రత్యేకత స్వచ్ఛమైన పాలతో తయారుచేసిన పాలకోవా దొరుకుతుంది. తిని ఆనందించండి.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి