భార్య
సాయంత్రం నాలుగు గంటలు అయింది
కాకినాడ పిఠాపురం రోడ్ లో ఉన్న బోట్ క్లబ్ పార్క్ రోజు వాకింగ్ కోసం వచ్చేవాళ్ళ తో ,ఆటలాడుకునే పిల్లలతో, మూలగా ఉన్న బెంచీల మీద కూర్చున్న ప్రేమికులతో చెరువులో చిన్న పడవలతో షికారు చేసే వాళ్ళ అరుపులతో, ఆ చెరువు మీద నుంచి వచ్చే చల్లటి గాలితో చాలా సందడిగా ఉంది. వాతావరణం అంతా ఆహ్లాదకరంగా ఉంది. సాధారణంగా మనశ్శాంతిగా ఉంటుందని ఇటువంటి ప్రదేశాలకు వస్తారు.
కానీ ఆ పార్కులో మూలగా ఉన్న బెంచి మీద ఒంటరిగా కూర్చున్న ఇరవై ఐదు ఏళ్ల వయసున్న యువతి సునీత మనసంతా కోపంతో రగిలిపోతోంది. "రెండు సంవత్సరాల నుంచి భర్త ప్రవర్తనలో ఏమి మార్పు లేదు. అన్ని విషయాలలోను బాగానే ఉంటాడు. బాగానే చూసుకుంటాడు. మరి డబ్బు దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్కడలేని పిసినారితనం. అప్పులు చేయవద్దు ఉన్న దాంట్లోనే సర్దుకోమంటాడు. సునీత కేమో టూర్లకి వెళ్లాలని సరదా. ఖరీదైన వస్తువులు కొనుక్కోవాలని కార్లలో షికార్లకి వెళ్లాలని ఒక ఆశ.ఆరు నెలలకు ఒకసారి ఏదో ప్లాన్ చేస్తూనే ఉంటుంది. భర్త దానికి ఒప్పుకోడు.
అన్నిటికీ డబ్బే ఆధారం. డబ్బు లేకుండా ఎలా గడుస్తుంది ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు కదా. అందుకనే డబ్బులు పొదుపు చేస్తున్నాను అంటాడు. సునీత భర్త రాజేష్ కలెక్టర్ ఆఫీస్ లో గుమస్తాగా పని చేస్తున్నాడు. లంచాలు వచ్చే ఉద్యోగం అయిన అటువంటి చెత్త పనులకు దూరంగా ఉంటాడు రాజేష్. ఆఫీసులో ఉన్నంతసేపు సొల్లు కబుర్లు చెప్పకుండా నిక్కచ్చిగా నిజాయితీగా పని చేసే మనిషి. అందుకే అధికారులు అందరికీ తలలో నాలుకలా ఉంటాడు. అందుకే ఒక్కొక్కసారి ఆదివారం కూడా ముఖ్యమైన పనులు ఉంటే అధికారులకి సహాయం చేస్తుంటాడు. రాజేష్ కి వచ్చే జీతంతో కొండమీద కోతిని తీసుకురాలేడు గాని ఆ దంపతులిద్దరూ సుఖంగా జీవనం సాగించవచ్చు. సినిమాలు కి గుడికి గోపురానికి తిరుగుతుంటారు కానీ పెద్ద పెద్ద టూర్లకి వెళ్లడం అంటే రాజేష్ కి పెద్దగా ఇష్టం ఉండదు.
ఇటువంటి విషయాల్లోనూ ఇద్దరికీ మనస్పర్ధలు వచ్చి రోజు చిన్నపిల్లలా దెబ్బలాడుకుంటారు. మళ్లీ పదిహేను రోజుల వరకు గాని ఇంట్లో వాతావరణం చల్లబడదు. ఇలా గొడవ జరిగినప్పుడల్లా రెండు మూడుసార్లు అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది సునీత. అలా వెళ్ళిపోయిన వారం రోజుల తర్వాత సునీత భర్త రాజేష్ అత్తవారింటికి వెళ్లి బతిమాలి తీసుకొచ్చేవాడు. అయినా గొడవలు మటుకు తగ్గలేదు. అందుకే కాస్త రిలీఫ్ కోసం సాయంకాలం పూట అలా బోటు క్లబ్ లోకి వెళ్లి
కూర్చుని వచ్చే పోయే జనాలను పరిశీలనగా చూస్తుంది.
ఇంతలో దూరం నుంచి ఒక వీల్ చైర్ లో నడివయస్సు వ్యక్తిని కూర్చోబెట్టుకుని తోసుకుంటూ ఒక మహిళ ఒక బెంచ్ దగ్గరికి వచ్చి కూర్చుని ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. సునీత వీళ్ళని ప్రతిరోజు గమనిస్తూనే ఉంటుంది. ఇద్దరూ కూడా ప్రశాంతమైన వదనంతో వాళ్లకి ఏమీ బాధలు లేనట్లు ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు. ఇలా చూస్తే సునీతకిముచ్చటవేసింది.ఎందుకో ఒకసారి లూ పలకరించాలనిపించింది. నమస్కారం అండి నా పేరు సునీత మేము ఇక్కడే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాలనీలో ఉంటున్నాము మా వారు కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగం చేస్తున్నారు అంటూ వారితో పరిచయం చేసుకుంది. వాళ్లు కూడా ప్రతి నమస్కారం చేసి తాము కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాలనీలో ఉంటున్నామనీ అంటూ అడ్రస్ చెప్పి తన పేరు రమణి ఆయన పేరు రాజారావు అని చెప్పి ఇవాళ ఆదివారం కదా మీరు ఒక్కరే వచ్చారంటూ మాటలలో అడిగింది ఆవిడ. సునీత కి ఏం బదులు చెప్పాలో తెలీక మాటను దాటేసింది. వాళ్ళిద్దరూ కూడా బాగా మాట్లాడుతూ వీలు చూసుకుని మీ దంపతులిద్దరూ మా ఇంటికి రండి అని ఆహ్వానించి అడ్రస్ తెలియకపోతే ఫోన్ చేయండి అంటూ మొబైల్ నెంబర్ ఇచ్చి వెళ్లారు. అప్పటినుంచి రెండు రోజులుకోసారి రమణి గారితో మాట్లాడుతోంది సునీత. గాయపడిన మనసుతో ఉన్న సునీతకి ఆవిడతో మాట్లాడుతుంటే చాలా రిలీఫ్ గా ఉంది. ఇద్దరి మధ్యా చనువు బాగా పెరిగింది .
ఒకరోజు సునీత పార్కులో పరిచయమైన దంపతుల ఇంటికి వెళ్లేటప్పటికీ వీధి తలుపు వేసి ఉంది. తలుపుట్టిన పది నిమిషాలకి రమణి గారు లోపల నుంచి చేయి తుడుచుకుంటూ వచ్చింది. చీరంతా తడిసిపోయినట్లుగా ఉంది.
ఆయనకి స్నానం చేయిస్తున్నాను. కూర్చోండి పది నిమిషాల్లో వస్తానంటూ ఆ హాలుకు దగ్గరగా ఉన్న బాత్రూంలో వెళ్ళింది. కాసేపటికి వీల్ చైర్ తోసుకుంటూ బెడ్ రూమ్ లోకి తీసుకు వెళ్లి బట్టలు మార్చి హాల్లోకి తీసుకువచ్చి కూర్చోబెట్టింది. ఎలా ఉన్నారు అంటూ ప్రశ్నించింది సునీతనీ. కళ్ళు ఏమిటి అలా ఉన్నాయి. అబ్బాయి రాలేదా మీ ఇద్దరికీ ఏమైనా గొడవలు జరుగుతున్నాయా అంటూ చనువుగా ప్రశ్నించింది. నిజానికి రాజేష్ కి సునీతకి ఏదో చిన్న విషయం మీద మాట మాట పెరిగి పెద్ద గొడవగా మారింది. ఇద్దరూ రాత్రి డిన్నర్ చేయడం మానేసి మంచినీళ్లు తాగి పడుకున్నారు. సునీత మాత్రం తెల్లవార్లు ఏడుస్తూ పడు కుంది
ఇవన్నీ రమణి గారికి చెప్పడం ఎందుకని అబ్బే అది ఏం లేదండి బాగానే ఉన్నాయి అంటూ సునీత మొహం పక్కకు తిప్పేసుకుంది. రమణి గారు సునీత పక్కకు వచ్చి అసలు ఏం జరుగుతోంది మీ ఇద్దరి మధ్య నిజం చెప్పు దాచకుండా అంటూ నిలదీసి అడిగింది. సునీత రాజేష్ మధ్య రెండు సంవత్సరాల నుంచి జరుగుతున్న గొడవలన్నీ సునీత చెప్పుకుంటూ వచ్చింది.
రమణి గారు ఏం మాట్లాడలేదు. కాఫీ తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్లి 10 నిమిషాల్లో కాఫీ గ్లా సుతో తిరిగి వచ్చింది. చూడమ్మా సునీత ఆడదాని జీవితం మగవాడితోటే ముడిపడి ఉంది. తోడు లేకుండా మనం ఈ లోకంలో జీవించడం కష్టం. మనకు చిన్నప్పుడు తండ్రి పెద్దయిన తర్వాత భర్త తోడుగా భగవంతుడు నిర్ణయించాడు. పెళ్లి అనే బంధం కలకాలం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బంధం. ఏదీ కూడా తెగేవరకు లాగకూడదు. ఈ బంధాన్ని తెంచుకోవడం మూడు నిమిషాల పని. ఆలోచించి చూస్తే మీ ఇద్దరి మధ్య గొడవలు ఏమీ లేవు కేవలం అభిప్రాయ బేధాలు తప్పితే. ఈ అభిప్రాయ భేదాలు కూడా ఆర్థిక సంబంధమైన విషయాల్లో మాత్రమే.
చూడు భర్త సంపాదన సక్రమమైన మార్గంలో ఖర్చు పెట్టవలసిన బాధ్యత భార్యదే. నిజానికి ఆర్థిక సంబంధమైన విషయాల్లో క్రమశిక్షణలో ఉండవలసింది భార్యకి మాత్రమే. భార్య అంటే ఒక ఆడిటర్ లాంటిది. ఆర్థిక విషయాల్లో బాధ్యతగా ఉన్న భర్త దొరకడం చాలా కష్టం ఈ రోజుల్లో. నీ వయసు కోరుకున్న సరదాలు తీర్చలేదని నీ భర్త మీద నీకు కోపం. అది ఈ వయసులో అందరికీ సహజమే కానీ భర్త ఆర్థిక పరిస్థితి కూడా చూసుకోవాలి. సరదా ఇవాళ కాకపోతే మరొకసారి తీర్చుకోవచ్చు.
కానీ భర్త మనసులో కనక వ్యతిరేక భావం వచ్చిందంటే అది చాలా సమస్యలకు దారి తీస్తుంది. కానీ నువ్వు చేస్తున్న అనాలోచిత పనులు కూడా సహించి మీ ఇంటికి వచ్చి నిన్ను తిరిగి తెచ్చుకుంటున్నాడంటే చాలా బాధ్యత గల వ్యక్తి అని ఓర్పు సహనం ఎక్కువ అని ఇట్టే గ్రహించొచ్చు. ఒకసారి మగవాడు మనసులోంచి ఆడది వెళ్ళిపోతే ఎవరు ఏమి చేయలేరు అంటూ చెప్పాల్సిన నాలుగు మాటలు నెమ్మదిగా చెప్పారు రమణి గారు. చూడమ్మా సంసారంలో అనేక కష్టాలు వస్తాయి. అలా అయిన దానికి కారణానికి మొగుడుతో దెబ్బలాటలు పెట్టుకుని నువ్వు పుట్టింటికి పరిగెత్తుకుని వెళ్ళిపోతే నీ నైజం బయటపడుతుo ది తప్పితే ప్రయోజనం ఏమీ ఉండదు సమస్య పరిష్కారo అవదు. మొగుడు తిట్టాడని, ఆడపడుచు సాధించిందని, టూర్లకి తీసుకెళ్లలేదని ఇవన్నీ సమస్యలు కానేకావు. నిత్యం ఇ లా నువ్వు గొడవలు పడుతుంటే మీ మధ్య అనురాగం ఎలా పెరుగుతుంది. ముందు ఇది నా కుటుంబం అని బాధ్యతగా ఫీల్ అవ్వాలి. అప్పుడే నీకు కుటుంబం మీద శ్రద్ధ పెరుగుతుంది. భర్త అంటే అభిమానం పెరుగుతుంది. అలా కాకుండా నీ భర్త నిత్యం బాధలు పెట్టి కొట్టి తిట్టి చేస్తుంటే నువ్వు ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు అంటూ చెప్పుకుంటూ వచ్చారు రమణి గారు. రమణి గారి మాటలు విని ఆలోచనలో పడింది సునీత.
అసలు సంసారంలో నీకేం సమస్యలు ఉన్నాయి. నా పరిస్థితి చూడు అంటూ తన కథ చెప్పసాగింది.మాకు భానుగుడి జంక్షన్ దగ్గర ఒక హోల్ సేల్ కిరాణా షాప్ ఉండేది. వ్యాపారం బాగానే సాగుతూ ఉండేది. మాకు ఇద్దరు మగ పిల్లలు. మా మామగారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసి రిటైర్ అయ్యి చనిపోయారు. ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు ఆయనదే. పిల్లలు ఇద్దరూ చదువులో ఎప్పుడు ఫస్ట్ . ఇద్దరి మధ్య రెండు సంవత్సరములు తేడా. ఇద్దరిని హైదరాబాదులో చదువు కోసం పెట్టాము. హాయిగా ఉన్న మా కాపురంలో మా వారికి సడెన్ గా హైబీపీ వచ్చి పెరాలసిస్ వచ్చి అపోలో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. పిల్లలిద్దరూ చదువులో ఉన్నారు.ఈ లోగా వ్యాపారం చూసే వాళ్ళు లేక వ్యాపారం మూసివేసాము. సరుకులు తీసుకున్న షాపులు వాళ్ళు చాలామంది బాకీ తీర్చకుండా మొహం చాటేసారు. వ్యాపారంలో నష్టం వచ్చి ఇల్లు కూడా అమ్మేసాము. అప్పులు తీర్చేసి మిగిలిన సొమ్ము బ్యాంకులో వేసుకున్నాము.మా వారి ఫ్రెండే ఇల్లు కొనుక్కున్నాడు. ఇప్పుడు మేము అద్దెకు ఉంటున్నాము. ఇప్పుడు లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ఆయనకు ఒక మనిషి సహాయం అవసరం. ఏ పని చేసుకోలేరు. అన్నం కూడా కలిపి పెట్టాలి. ఒకపక్క పిల్లలు చదువులు. ఆదాయం లేని సంసారం. ఇలా ఉంది మా పరిస్థితి. ఆయన నెరవేర్చవలసిన బాధ్యతలు కూడా నేను నెరవేరుస్తూ ఆర్థిక సమస్యలను తట్టుకుంటూ ఇలా నవ్వుతూ జీవితం గడుపుతున్నాను అంటూ రమణి గారు చెబుతున్న మాటలు విని సునీత కళ్ళ వెంట నీళ్లు కారాయి.
చూడమ్మా నువ్వు నాతో చెప్పిన ఈ సంసార విషయాలను బట్టి నేను అర్థం చేసుకున్న దానికి నేను ఈ సమాధానం చెప్పాను.
తల్లిదండ్రుల లక్షలు ఖర్చుపెట్టి పిల్లలకు చాలా వైభోగంగా పెళ్లిళ్లు చేస్తున్నారు. పెళ్లయిన రెండు సంవత్సరాల్లోనే ఏవో సమస్యలు సాకుగా చెప్పి ఆడపిల్లలు ఇంటికి తిరిగి వచ్చేస్తున్నారు. తల్లిదండ్రులకు ఇది చాలా తీరని సమస్య. సంఘంలో అవమానం. ఆర్థికంగా నష్టం. అహంకారం తప్పితే మనసుపెట్టి ఆలోచించట్లేదు ఎవరు. నిజంగా సమస్య ఉంటే ఎవరు బలవంతంగా ఉండమని చెప్పారు. సహజంగానే మనుషులలో సహనo అనే గుణం ఎప్పుడో పారిపోయింది. దానికి తోడు ఇటువంటి సమస్య లు. ఇంకేముంది అందరూ కత్తులు దూసుకునేవాళ్లే. ఇలా ఉంది పరిస్థితి. ఇది నీ జీవితం. చక్కదిద్దుకోవాల్సింది కూడా నువ్వే అంటూ చెప్పవలసిన నాలుగు మాటలు చెప్పి ఎక్కువ చొరవ తీసుకున్నందుకు క్షమించు అంటూ సునీత తలని దగ్గరగా తీసుకున్నారు. సునీత ఒక్కసారి గట్టిగా వెక్కి వెక్కి ఏడ్చింది. తర్వాత రమణి గారి కాళ్లకు నమస్కారం చేసి తేలికబడిన మనసుతో ఇంటికి బయలుదేరింది.
అప్పటినుంచి ప్రతి ఆదివారం రాజేష్ సునీత రాజారావు దంపతులకు పార్కులో కనపడి నవ్వుతూ మాట్లాడుతుంటారు. వీలున్నప్పుడల్లా ఆ దంపతుల ఇంటికి వెళ్తుంటారు. మంచి చెడు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రెండు కుటుంబాల మధ్య బాగా చనువు పెరిగింది.
ఇంతలో ఒకరోజు ఊరు నుంచి సునీత తండ్రి వచ్చి కూతురు కాపురం చూడడానికి వచ్చి సునీత కాపురం స్థిరపడిందని సంతోషించి రాజారావు గారి ఇంటికి తీసుకెళ్ళమని అడిగారు. రాజారావు గారు మీకు ఎలా తెలుసు అంటూ ప్రశ్నించింది సునీత తండ్రిని. రమణి గారిది సునీత తండ్రి గారిది చిన్నప్పుడు ఒకటే ఊరని అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారని సునీత విషయాలన్నీ ఫోన్ చేసి చెప్పానని అందుకనే ఆమె అంత చొరవుగా మంచి చెడులు చెప్పిందని సునీత తండ్రి నవ్వుతూ చెప్పాడు. సునీతతో సహా ముగ్గురు రాజారావు గారి ఇంటికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపి వచ్చారు.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి