పల్లె సంక్రాంతి

పల్లె సంక్రాంతి

సంక్రాంతి ఎంత అందమైన పేరు. నిజంగానే ఒక కొత్త కాంతిని తీసుకొస్తుంది ఈ పండుగ.పెళ్లయిన ఆడపిల్ల అత్తారింటి నుండి పుట్టింటికి పండక్కి ప్రయాణమైనట్లు సూర్యుడు కూడా మకర రాశిలోకి ప్రయాణమవుతాడు. అమ్మాయి పండగకి పుట్టింటికి వస్తే తల్లిదండ్రులకు ఎంతో ఆనందం. ఆడపిల్ల పండగకి కొత్త వెలుగు తీసుకొస్తుంది. ఇంటికి అందo వస్తుంది. లోకమంతటికి వెలుగునిచ్చే సూర్య భగవానుడు మకర రాశిలోకి మారడంతో ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. పండగ అందరికీ సమానమే. కానీ పల్లెటూరి పండగ అందమే వేరు. ఇంకా తెలుగు లోగిళ్ళలో సంక్రాంతి పండగ అందం పూర్తిగా కనబడుతుంది.
నెల రోజుల ముందు నుంచే వీధుల లలో కళ్ళాపి జల్లి పోటీపడి వేసే ముగ్గులతో సంక్రాంతి సంబరాలు మొదలు. ముగ్గులు పెట్టడం కూడా ఒక కళ. ముగ్గు తెలుగు వాకిళ్లకు ఒక అందం . ముగ్గుతో అలంకరించడం ఒక శుభ సూచకం. ఇలా ప్రారంభమైన ముగ్గుల సందడి ముక్కనుమ పండుగ వరకు కొనసాగుతుంది. ముక్కనుమ నాడు వేసే రథం ముగ్గుతో ముగుస్తుంది. గోమయంతో చేసిన గొబ్బెమ్మలను గుమ్మడి పూలతో అలంకరించి కన్నెపిల్లలు గొబ్బెమ్మల చుట్టూ చేరి నృత్యాలు చేస్తారు. పెద్ద గొబ్బెమ్మను గోదాదేవిగా భావిస్తారు. గోదాదేవిని ఆరాధిస్తే కన్నెపిల్లలకు మంచి భర్త వస్తాడని విశ్వాసం.ఇది అతి ప్రాచీన సాంప్రదాయం. అన్నమయ్య సంకీర్తనలలో గొబ్బి పాటలు ప్రధాన పాత్ర వహిస్తాయి. 
 నగర సంకీర్తన కూడా ఈ ధనుర్మాసంలో ఒక ప్రత్యేక ఆకర్షణ.
  గోమయంతో చేసే భోగి పిడకల దండల తయారీ నెల రోజులు ముందు నుంచి ప్రారంభమవుతుంది. ప్రతి ఇల్లు కొత్తగా వేసిన రంగులతో కళకళలాడుతుంటుంది. ధనుర్మాసం ప్రారంభమైన దగ్గర నుంచి పల్లెటూరి స్త్రీలు వాకిళ్ళ ముందు ముగ్గులు మరియు ఇంటి శుభ్రత లో నిమగ్నమైపోతారు. దేవాలయాల్లో ధనుర్మాస పూజలు ప్రారంభమవుతాయి. దేవుడికి పెట్టే నైవేద్యం చక్ర పొంగలి పులిహోర మర్చిపోలేం. 
      పండగకి వచ్చే అతిధుల కోసం ప్రత్యేకమైన తీపి తినుబండారాలైన అరిసెలు కజ్జికాయలు పాకుండలు జంతికలు చేగోడీలు తయారు చేయడంలో బిజీ అవుతారు. ఇక రైతులకు పంటలు చేతికొచ్చే సమయం. పనులన్నీ చక్కపెట్టుకుని రాబోయే అతిథుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పండగ అంటే ఏముంది. పదిమంది కలవడమే పండగ. మనసు విప్పి మాట్లాడుకోవడమే పండగ. అందుకే ఒక రోజు సెలవు అయినా బంధువులను కలుసుకోవడానికి పల్లెటూరికి ప్రయాణం అవుతుంటారు. ఇక ప్రకృతి కూడా చాలా ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉంటుంది. ఆకాశం నుండి కురిసే మంచు కంటికి ఆనందంగా ఉంటుంది. ఎముకలు కొరికే చలి పొద్దెక్కిన దుప్పటి ముసుగు తీయనివ్వదు. ప్రతి వీధిలోనూ రాత్రిపూట చలి మంటలు దర్శనమిస్తాయి. ముద్దబంతి చామంతి తలలో
  పెట్టుకుని పౌష్య లక్ష్మి పండగ వాతావరణం కల్పిస్తుంది. బంతులు చామంతులు సింహద్వారాలకు అలంకరణగా మారి ఎంతో అందాన్నిస్తాయి. కంటికి ఇంపుగా కనిపిస్తాయి. పట్టు పావడ ధరించిన రెండు జెళ్ళ సీతకి కొత్త అందం వస్తుంది.

 పండగ రెండు రోజులు ముందు నుంచి బంధువుల రాక ప్రారంభమవుతుంది. ప్రతి ఇల్లు బంధువులతో కళకళలాడుతుంది. బంధువులతో పాటు భోగి పండుగ కూడా భోగిమంటతో తెల్లవారేటప్పటి కల్లా వచ్చేసింది. నెలరోజుల ముందు నుంచి తయారుచేసిన భోగి పిడకలు ఆ అగ్ని దేవుడికి 
ప్రతాపానికి ఆహుతయ్యి బూడిద అయిపోతాయి. అది అగ్నిదేవుడు ప్రసాదంగా నుదుట విభూదిగా మారిపోతుంది.

   భోగిమంట వేయడంలో ఒక ఆరోగ్య రహస్యం ఉంది. చలికాలంలో శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా వస్తాయి. గోమయంతో చేసిన పిడకల పొగ మంచి ఆక్సిజన్ ఇస్తుంది.
ఆధునిక కాలంలో పిడకలకు బదులు టైర్లు ఇంటిలోని చెత్త సామాను భోగిమంటగా వేస్తున్నారు. ఇది అతి ప్రమాదకరం. భోగి పండగ భోగం తెస్తుందని అంటారు. భోగి పండుగ నాడే గోదాదేవి రంగనాథ స్వామి వారిలో ఐక్యమై భోగాన్ని పొందిందని దానికి గుర్తుగా భోగి పండుగ జరుపుకుంటామని
పురాణ కథనం. ఇక సాయంత్రం పూట భోగి పళ్ళ పేరంటం.
భోగి పండుగకి ఇది ప్రత్యేక ఆకర్షణ. ఈ కాలంలో రేగిపళ్ళు ఎక్కువగా వస్తాయి . సూర్యుడికి ఇష్టమైనది రేగుపళ్ళు. ఇంట్లోనే చంటి పిల్లలకి తల పైన రేగుపళ్ళు, చిల్లర , శనగలు పోసి ముత్తయిదులను సత్కరిస్తారు. ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు. ఆ చంటి పిల్లలు దిష్టి పోయి ఆరోగ్యకరంగా ఉంటారని అంతరార్థం. పండగ సంబరాల్లో ముఖ్యమైనది బొమ్మలకొలువు పేరంటం. రకరకాల బొమ్మలను ఒక బల్ల మీద వరుసగా పేర్చి ముత్తైదువులను పిలిచి సత్కరిస్తారు. ముఖ్యంగా పాడి పంటల కోసం సంతాన సౌభాగ్యం కోసం కన్నెపిల్లలు మంచి భర్త కోసం ఈ బొమ్మల కొలువు పేరంటం చేస్తారు. ఇది కూడా అతి ప్రాచీన సాంప్రదాయమే. సాంప్రదాయం వెనక మంచి ఉంటుంది. మంచిని తెలుసుకుని సాంప్రదాయం పాటించడం చాలా ఆరోగ్యకరమైన విషయం.

అలా మొదటి పండుగ రోజు అలిసిపోయి పెద్ద పండక్కి కొంచెం ఆలస్యంగానే లేస్తారు. పెద్దలు కాదు పిల్లలు మాత్రమే. అమ్మకు ఆలస్యంగా లేవడం ఎలా కుదురుతుంది. అందులో పండగ రోజు. ఒంట్లో శక్తి ఉన్న లేకపోయినా పిల్లలందరినీ చూసేటప్పటికి అమ్మకి వయసు వెనక్కి వెళ్ళిపోతుంది. అమ్మకి మాత్రమే ఉంటుంది ఆ ప్రేమ. అమ్మే ఆ ఇంటికి వెలుగు పిల్లలను చూస్తే ఆమె కంటిలో వెలుగు. వీధిలో ముష్టివాళ్ళు తాకిడి ప్రారంభం అవుతుంది. గంగిరెద్దుల సందడి ఆరంభం అవుతుంది. ఈ గంగిరెద్దుల వారు ఏడాదికి ఒకసారి వస్తారు. ఈ గంగిరెద్దుల విన్యాసం చూడముచ్చటగా ఉంటుంది. పండగ పూట వినోదాన్ని ఇస్తుంది. గృహస్తులు కూడా వారికి తోచింది ఇచ్చి సత్కరించి పంపుతుంటారు. అమ్మ చేసే పిండి వంట రుచి మళ్లీ పండగ వచ్చేదాకా నోరు పట్టుకుని వదలదు. ఇది అతిశయోక్తి కాదు. అమ్మ చేతిలోనే ఉందా మహత్యం. అమ్మ అంటే అంతే మరి. ఇంకో ముఖ్యమైన వినోద కార్యక్రమం కోడి పందాలు. తెలుగు రాష్ట్రాలలో జరిగే కోడిపందాలు చూడ్డానికి దూర ప్రదేశాల నుంచి వస్తారు. ఈ పందెంలో కోడిపుంజులకు నెలరోజుల ముందు నుంచి ప్రత్యేక ఆహారం పెట్టి యుద్ధానికి సంసిద్ధం చేస్తారు . కాళ్లకు కత్తులు కట్టుకుని బద్ధ శత్రువులా యజమాని ఆనందం కోసం ప్రాణాలర్పిస్తాయి కోడి పుంజులు. యుద్ధంలో గెలిచిన ఓడిన పుంజుకు ఒరిగేది ఏమీ లేదు. ఇలా మూగజీవుల యుద్ధం కోసం కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంది.

ప్రతి ఏటా పోలీసు వారు అనుమతి ఇవ్వకపోవడం కోడిపందాలు జరగడం మామూలే. ఇలా మూగజీవుల ప్రాణాలతో చెలగాటమాడి జాతరలో చంటి దానికి బొమ్మలు కొనుక్కుని గుండు ఆట ఆడి అలిసిపోయి ఇంటికి చేరుతారు. మళ్లీ పెద్ద పండుగ ఎప్పుడు వస్తుందని ఆలోచనతో నిద్రలో జారుకునేసరికి తెల్లవారి కనుమ పండగ వాకిట్లోకి వచ్చేస్తుంది. కనుమ పశువులు పండుగ. రైతుకి పశువుకి అవినాభావ సంబంధం ఉంది. రైతుకి వ్యవసాయ పనుల్లో పశువు సహాయకారిగా ఉంటుంది. దానికి కృతజ్ఞతగా ఈ పండగ నాడు పశువులను పూజించడం జరుగుతుంది. కొన్నిచోట్ల ఎడ్ల పందాలు కూడా జరుగుతాయి. కనుమ నాడు మినుము తినాలని గారెలు చేయడంలో అమ్మ నిమగ్నం అయిపోతుంది. 
ప్లేట్లోకి వచ్చిన గారి తినడం సులువే. కానీ అమ్మ కష్టాలు ఎవరికి తెలుసు. అమ్మ పడ్డ కష్టమే బిడ్డకు కలిగిన సౌకర్యం. మూడో రోజు జాతర కూడా చూసి పండగ అయిపోయింది అని దిగులుతో మంచాలు ఎక్కుతారు. ముక్కనుమ నాడు వేసే రథం ముగ్గు తో పాటు బంధువులందరూ ప్రయాణమైపోతారు. అమ్మ మనసంతా దిగులు. మళ్లీ పండగ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూపులు. పిల్లలతో కళకళలాడే పల్లె వీధులన్నీ నిశ్శబ్దంగా ఉంటాయి. మళ్లీ సంక్రాంతి కోసం ఆ పల్లె ఎదురు చూస్తూ ఉంటుంది. సంక్రాంతి ఏడాదికోసారి కాదు ప్రతినెలా వస్తే ఎంత బాగుంటుంది అనుకుంటుది ఆ పల్లె. అమ్మ మనసు లాగే.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
           కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట