దేవుడి శాపం
దేవుడి శాపం
" చూడండి రాఘవరావు గారు మీ అక్కయ్య గారి దావా
నెగ్గాలంటే కచ్చితంగా ఆమెకి వారసులు కావాలి.
ఆమెకు సంతానం లేదు కదా! లేదంటే ఆస్తి అవతల పార్టీకి వెళ్ళిపోతుంది అంటూ చెబుతున్న లాయర్ మాటలు విని
సరేనండి ఆలోచిస్తాను అంటూ కోర్టు నుండి ఇంటికి తిరిగి వచ్చాడు రాఘవరావు.
రాఘవరావు అక్క గారి పేరు కాంతమ్మ. కాంతమ్మని చిన్నతనంలోనే మేనత్త కొడుకు కామేశ్వరరావు కి ఇచ్చి వివాహం చేశారు. కామేశ్వరావుకి చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో తండ్రి గారాబంగా పెంచాడు . దాంతో కామేశ్వరరావుకి చదువు వంట పట్టలేదు . పైగా వ్యసనపరుడు. వివాహమైన కామేశ్వరరావు తిరుగుళ్ళు మాత్రం ఆగలేదు. పాపం కాంతమ్మ గారికి పుట్టిన పిల్లలందరూ పురిట్లోనే చనిపోయేవారు. దానికి తోడు సవిత అత్తగారు సుందరమ్మ గారు పెట్టే బాధలు, భర్త దగ్గర నుంచి ఆదరణ లేకపోవడం, ఆయన ప్రవర్తన సరిగా ఉండకపోవడం వీటన్నిటికి తోడు కామేశ్వరరావు గారు, కాంతమ్మ గారి మామగారు ఒకే సంవత్సరంలో చనిపోవడం తో కాంతమ్మ గారికి మతి చలించింది. ఎన్ని మందులు వాడిన ఎంత వైద్యం చేయించిన ఫలితం లేకుండా పోయింది.
ఆ సమస్య వచ్చినప్పుడల్లా ఏడాదికి ఆరు నెలల పాటు సరిగా తిండి తిప్పలు తినకుండా ఒక మూల కూర్చుని తనలో తానే మాట్లాడుకుంటూ ఉండేది.
కాంతమ్మ గారి మామగారు బాగా ఆస్తిపరుడు. పాపం కాంతమ్మ గారికి ఆస్తిలో వాటా ఇవ్వకుండా సవిత అత్తగారు మొత్తం అంతా దొంగ కాగితాలు సృష్టించి తన పేరు మీద మార్చుకుని కాంతమ్మ గారిని ఇంట్లోంచి వెళ్ళగొడతారు. మతి సరిగా లేనీ కాంతమ్మ గారు తమ్ముడు రాఘవరావు ఇంటికి చేరుతారు. ఇటువంటి పరిస్థితుల్లో పుట్టింటికి చేరిన కాంతమ్మ నీ కంటికి రెప్పలా చూసుకునేవారు రాఘవరావు దంపతులు. రాఘవరావు కాంతమ్మని తీసుకుని తిరగని ఆసుపత్రి లేదు. ఎక్కడో నాటు వైద్యం చేస్తున్నారని తెలుసుకుని ఆ ఊరిలో కాపురం పెట్టి కాంతమ్మకు వైద్యం చేయించిన ఫలితం లేకపోయింది. ఎప్పుడు ఆ స్థితిలోకి వెళ్ళిపోతారో తెలీదు. ఒకసారి ఆ జబ్బు వస్తే ఆరు నెలలపాటు మామూలుగా ఉండేవారు కాదు.. ఎవరితోటి మాట్లాడేవారు కాదు. తనకు తోచిన పని చేస్తుండేవారు. అది కొన్ని సందర్భాల్లో ప్రమాదకరమైనది కూడా ఉండేది . అక్కగారి పరిస్థితి చూసి రాఘవ రావుకి ఏం చేయాలో తోచేది కాదు. ఎన్నో పూజలు వ్రతాలు నోములు ప్రతి శనివారం భజనలు చేసేవారు. ఎన్ని వైద్య విధానాలు ప్రయత్నించిన ఫలితం లేకపోవడంతో అలాంటి పరిస్థితుల్లో కాంతమ్మ ను తీసుకుని ఉత్తరాది దక్షిణాది యాత్రలు పూర్తి చేశారు ఏ పుట్టలో ఏ పాము ఉందో . ఏ దేవుడైనా కరుణిస్తాడేమో అని.
కానీ ఏ జన్మలో చేసుకున్న పాపమో కాంతమ్మ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు లేదు.రాఘవరావు భార్య రాజమ్మ సహజంగానే చాలా ఓపిక మంతురాలు. ఇటువంటి కాంతమ్మని చంటి పిల్లల చూసుకునేవారు రాజమ్మ.
ఇటువంటి పరిస్థితుల్లో కాంతమ్మ గారి ఆస్తి కోసం కాంతమ్మ గారి సవితి అత్తగారి మీద కోర్టుకి వెళతాడు రాఘవరావు.
కోర్టు నుండి ఇంటికి తిరిగి వచ్చిన రాఘవరావు భార్య తోటి విషయం అంతా పూర్తిగా చెప్పి" చూడు రాజమ్మ మా అక్క పరిస్థితి చక్కబడాలంటే మన రెండో అబ్బాయి రాకేష్ ని దత్తత ఇద్దామనుకుంటున్నాను. నీ అభిప్రాయం ఏమిటి? అని అడిగాడు రాఘవరావు రాజమ్మని. లేదండి నాకు ఇష్టం లేదు. అలా దత్తత ఇస్తే మనకు దూరమైపోతాడా పిల్లాడు. అయినా ఉన్న పిల్లల్లో చాలా తెలివైనవాడు. బాగా చదువుకుంటున్నాడు. మంచి ఉన్నత స్థితిలోకి వచ్చి మనల్ని చూసేది వాడే.
అంతే కాదు ఆ పీటల మీద కూర్చుని శాస్త్రోక్తంగా దత్తత స్వీకారం నేను చేయలేను అంటూ ఏడుస్తూ చెప్పింది రాజమ్మ.
అవును నవమాసాలు మోసి కష్టపడి పెంచిన కన్న బిడ్డని వేరొకరికి దత్తత ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. దత్తత ఇచ్చిన నాటినుండి కన్నతల్లితో సంబంధ బాంధవ్యాలు ఏవి ఉండవు. అసలు తల్లిదండ్రులు రికార్డులో ఎక్కడ ఉండరు ఇంటిపేరు మారిపోతుంది. వంశం మారిపోతుంది.
"చూడు మనం కాకపోతే ఎవరు సహాయం చేస్తారు మా అక్కకి.
మనకు ఇంకా ఏడుగురు పిల్లలు ఉన్నారు మనల్ని చూసుకోవడానికి.అయినా గాని వాళ్ళిద్దరూ ఇక్కడే ఉంటారు మనతో పాటు. వాళ్ల బాగోగులన్నీ మనమే చూస్తాం. ఎక్కడికి పంపించo . నాకు మటుకు బాధగా లేదు. పిల్లాడిని వదులుకోవడానికి అంటూ సముదాయించి రాఘవరావు దత్తత ముహూర్తాలు పెట్టించేసాడు. అప్పటికి రాకేష్ వయసు పదిహేను సంవత్సరాలు. అలా రాకేష్ కి కాంతమ్మ దత్తత తల్లి అయింది. రాఘవరావు గారు గార్డియన్ గా రికార్డుల్లోకి ఎక్కారు.
మిగిలిన పిల్లలందరితోటి సమానంగా రాకేష్ ని ఎప్పటిలాగే సొంత కొడుకు లాగా చూసేవారు. అందరు తోటి సమానంగా చదువు చెప్పించేవారు. రాకేష్ చదువులో చూపిస్తున్న తెలివితేటలు చూసి రాఘవరావు భవిష్యత్తులో కుటుంబానికి రాకేష్ సహాయం చేస్తాడని భావించేవారు.
కాంతమ్మ గారు రాకేష్ కి ఎప్పుడు గుప్పెడు అన్నం వండి పెట్టిన రోజు లేదు. రాకేష్ మంచి చెడ్డలు చూసిన పాపాన పోలేదు. రాకేష్ సొంత తల్లిని అమ్మా అనే పిలిచేవాడు. మిగతా పిల్లలు కంటే ఎక్కువగా రాకేష్ ని చూసేవారు రాఘవరావు దంపతులు.
పాపం రాఘవరావు ఎంత శ్రమపడిన కోర్టులో దావా నెగ్గలేదు. కోర్టు ఖర్చులకి లాయర్ గారు ఫీజులు కి చాలా డబ్బు ఖర్చు అయ్యి అప్పుల పాలయ్యారు రాఘవరావు.
ఇంతలో పిల్లల చదువులు ,ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయవలసి రావడం, కుటుంబ ఖర్చులు పెరిగిపోవడంతో ఉన్న నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాలు అమ్మేశారు.
ఈలోగా రాకేష్ కి గవర్నమెంట్ ఉద్యోగం రావడం దగ్గర బంధువుల అమ్మాయితో వివాహం జరగడం జరిగిపోయేయి. ఈ కార్యక్రమాలన్నీ రాఘవరావు దంపతులు దగ్గరుండి జరిపించారు. రాకేష్ కి పెళ్లి అయ్యి వేరే ఊళ్లో కాపురం పెట్టిన కాంతమ్మ గారిని మటుకు తీసుకెళ్లలేదు. పదిమంది చంటి పిల్లలను పెంచొచ్చు కానీ ఒక మతిస్థిమితం లేని వాళ్ళని చూడడం అనేది చాలా కష్టం. వాళ్ళు ఏ క్షణానికి ఎలా ఉంటారో ఏం పని చేస్తున్నారో కూడా అసలు తెలియదు. ఉదయం లేచిన దగ్గర్నుంచి పళ్ళు తోమడం స్నానం చేయించడం అన్నం పెట్టడం వరకు అన్ని రాజమ్మ స్వయంగా చేసేవారు.ఇంకా కాలకృత్యాలు ఎక్కడపడితే అక్కడే తీర్చుకునే వారు కాంతమ్మ .
ఇవన్నీ తెలిసి చేసినవి కాదు. ఇంతమంది పిల్లల్ని పోషించుకుంటూ కాంతమ్మ బాగోగులు చూడడం వలన అసలు ఖాళీ ఉండేది కాదు రాజమ్మ కి.
కాంతమ్మ చేసే పనులు ఒక్కొక్కసారి చాలా బాధ కలిగించేవి రాజమ్మ కి. రాత్రి పగలు గట్టి గట్టిగా మాట్లాడడం, పౌర్ణమి నాడు వెన్నెల్లో డాన్సులు చేయడం, బొగ్గు పొడి కంటికి కాటుక పెట్టుకోవడం ,దూరం నుంచి మోసుకుని తెచ్చుకున్న నీళ్లు పారబోయడం ,ఇలా కాంతమ్మ చేసే పనులకు అర్థం ఉండేది కాదు. దానికి తోడు అన్నం బలవంతంగా తినిపించవలసి వచ్చేది.
పెళ్లయిన దగ్గర్నుంచి కాంతమ్మ గురించి గానీ రాఘవరావు ఫ్యామిలీ గురించి కానీ అసలు పట్టించుకోవడం మానేసాడు రాకేష్. ఈలోగా రాఘవరావుకి క్యాన్సర్ జబ్బు వచ్చింది. అప్పటికి రెండు చేతుల సంపాదిస్తున్నాడు రాకేష్. రాఘవరావు గారి మందులకి వైద్య ఖర్చులకి ఎక్కువగా డబ్బులు అవసరమయ్యేవి. చుట్టపు చూపుగా వచ్చి రాఘవరావును చూసి వెళ్ళిపోయాడు గాని రాకేష్ ఒక పది రూపాయలు కూడా రాఘవరావుకి ఇవ్వలేదు. ఎంతో ఆశించిన రాఘవరావు కి నిరాశ ఎదురయింది. నిజానికి రాకేష్ తన కన్న కొడుకు రాఘవ రావే పెంచి పెద్ద చేశాడు . మంచి ఉద్యోగం వచ్చింది. రాఘవరావు మిగతా పిల్లల కంటే రాకేష్ ఉన్నత స్థితిలో ఉన్నాడు.
అయినా తనని రాకేష్ ఎందుకు పట్టించుకోవడం లేదో అప్పుడు అర్థమైంది రాఘవరావుకి. ఒకరోజు రాత్రి హాల్లో పడుకున్న రాఘవరావుకి గదిలోంచి రాకేష్ భార్యతో అంటున్న మాటలు వినిపించాయి. "మా నాన్న డబ్బు గురించి చాలా బాధపడుతున్నాడు. మందులకి ఆసుపత్రికి చాలా డబ్బు ఖర్చు అయ్యింది. అప్పుల పాలయ్యాడు. నేను అప్పులన్నీ తీర్చేద్దాం అనుకుంటున్నా ను అన్నాడు రాకేష్. మీకేం సంబంధం మిమ్మల్ని దత్తత ఇచ్చేశారు కదా! అసలు వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళు చూసుకుంటారు మీరు అనవసరంగా తగిలించుకోకండి అంటూ చెబుతున్న రాకేష్ భార్య మాటలు విని రాఘవరావు చాలా బాధపడ్డాడు.
భార్య బాధపడుతున్న వినకుండా స్వార్థం చూసుకోకుండా కేవలం తన అక్క గారి జీవితం బాగుపడుతుందని ఉద్దేశం తో తన కడుపుని పుట్టిన పిల్లాడిని ఇలా దత్తత ఇస్తే వీడు ఇలా తయారయ్యాడు అనుకుని బాధపడ్డాడు రాఘవరావు. పోనీ రాఘవరావునీ చూడకపోతే చూడకపోయాడు కనీసం కాంతమ్మ నీ కూడా తనతో పాటు తీసుకెళ్తానని ఏనాడూ అనలేదు. కాంతమ్మ మాట ఎప్పుడు ఎత్తలేదు రాకేష్.
అలా కొద్ది రోజులకి కాంతమ్మ కాలం చేసింది. కాంతమ్మ మరణ వార్త రాకేష్ కు ఫోన్ చేసి చెప్పిన రాఘవరావుకి రాకేష్ సమాధానం విని మతిపోయింది.
"ఆఫీస్ వాళ్లు తననీ అమెరికా పంపుతున్నారని ప్రస్తుతం హడావుడిలో ఉన్నానని ఎవరికి ఇటువంటి ఛాన్స్ రాదని కావాలంటే డబ్బులు పంపిస్తానని రాకేష్ చెప్పిన మాటలు విని రాఘవరావు కాంతమ్మ గారికి అన్నీ తానై అంతిమ సంస్కారాలు పూర్తి చేశాడు రాఘవరావు.
కొంతమంది బాధలు పడడానికి పుడతారు. కాంతమ్మ జీవితంలో సంతోషం అనే మాట ఎప్పుడూ లేదు. చిన్నతనంలో పెళ్లి తర్వాత భర్తతో బాధలు, తర్వాత దేవుడు పెట్టిన బాధలు కనీసం దత్తత చేసుకున్న కొడుకు అయినా చూస్తాడని అనుకుంటే వాడు కూడా పట్టించుకోలేదు ఏమిటో అక్క జీవితం అనుకుని బెంగపెట్టుకుని క్యాన్సర్ తిరగబెట్టి రాఘవరావు మంచం ఎక్కాడు.
ఒకరోజు భార్య రాజమ్మను పిలిచి నువ్వు వద్దంటున్నా వినకుండా మన రాకేష్ ని దత్తత ఇచ్చాను. చిన్నప్పుడు వాడు ఎలా ఉండేవాడు. కష్టసుఖాలు తెలిసిన కుర్రవాడు. కానీ పెళ్లయిన తర్వాత దత్తత అనే పేరుతో మన నుండి విడదీసారు. దత్తత తీసుకున్న మా అక్క కూడా ఏ విధంగాను వాడి వలన సుఖపడలేదు. కనీసం అంతిమ సంస్కారం కూడా వాడు చేయలేదు. పైగా డబ్బులు పంపిస్తానని చెప్పాడు. డబ్బులు కోసం మనం ఫోన్ చేయలేదు. రేపొద్దున నేను చనిపోయిన డబ్బులు ఇస్తానంటాడు. ఒక పది పైసలు కూడా వాడి దగ్గర పుచ్చుకోవద్దు అలా చూడవలసిన బాధ్యత నీదే అంటూ చెప్పి కొద్ది కాలానికి రాఘవరావు కన్ను మూశాడు.
రాఘవరావు అంతిమ సంస్కారాలకు వచ్చిన రాకేష్ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మిగిలిన ఆస్తి రెండెకరాల్లో తన కూడా వాటా వస్తుంద నీ చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రాజమ్మ ఉన్న రెండు ఎకరాలు అమ్మేసి పిల్లలందరికీ సమానంగా ఇచ్చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడూ రాఘవరావు దంపతులు రాకేష్ ని సొంత కొడుకు గానే చూశారు.
కుటుంబంలో కొన్ని పనులు ఎంతో మంచి దృష్టితో చేసిన కొన్ని సందర్భాల్లో అవి ఎందుకో సత్ఫలితాలను ఇవ్వవు. ఒకవేళ దేవుడు శాపమేమో .
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి