డొక్కా సీతమ్మ
ఆలి జేబులు తడుముతుంది. అమ్మ డొక్క చూస్తుంది.
అన్నది ప్రాచీన నానుడి. అది అమ్మతనం. కానీ ప్రతి బాటసారి ఆకలికి పట్టెడన్నం పెట్టే నిరతాన్న ధాత్రి అపర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారు మన ఆంధ్ర ప్రదేశ్ చెందిన వారు కావడం మన దేశానికే గర్వకారణం. తూర్పుగోదావరి జిల్లా ఘనతని ప్రపంచ వ్యాప్తి పరం చేసిన ఒక అమృతమూర్తి డొక్కా సీతమ్మ గారు.
అందరూ ఆడపిల్లలు లాగే ఆ అమృతమూర్తి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా మండపేట గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో అను పిండి వారి ఇంట్లో జన్మించింది. తండ్రి భవాని శంకరం. తల్లి నరసమ్మ. స్త్రీ విద్యకు ఎక్కువ అవకాశం లేకపోవడంతో సీతమ్మగారు పెద్దగా చదువుకోలేదు. తల్లిదండ్రుల దగ్గర నుండి రామాయణ మహాభారత కథలు పద్యాలు నేర్చుకోవడం జరిగింది. పెద్దబాలశిక్ష కూడా పూర్తిగా చదవలేదు. ఈలోగా తల్లి చనిపోవడంతో భవాని శంకరం గారి కుటుంబ బాధ్యత ఆమె భుజస్కంధాలపై పడింది.
సాధారణంగా పెళ్లిళ్లు ఎలా కుదురుతాయి అంటే బంధువుల పెళ్ళిలో ఆడ పిల్లలను చూసినప్పుడు వరుడు తల్లిదండ్రులు పిల్లగురించి వాకబు చేస్తారు.
అదేవిధంగా అనుకోకుండా వచ్చిన బంధువులు కూడా ఇంట్లో ఉన్న ఆడ పిల్లను చూసి ముచ్చటపడి మరీ సంబంధం కలుపు కుంటారు. అలా అనుకోకుండా వచ్చిన అతిథి డొక్కా జోగన్న పంతులు . ఈయన లంకలగన్నవరం పెద్ద ధనవంతుడు మరియు వేద పండితుడు. ఆయన ఒకరోజు మండపేట గ్రామానికి వేద సభకు రావడం జరిగింది. మధ్యాహ్న సమయానికి భోజనానికి భవానీ శంకరం గారి ఇంటికి రావడం జరిగింది.
ఆ రోజుల్లో హోటల్స్ అంతగా లేవు. హోటల్ ఉన్న బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు హోటల్స్ లో తినడానికి ఇష్టపడేవారు కాదు. సీతమ్మ గారి ఆదరాభిమానాలు ఆప్యాయతను చూసి ఆమె అందాన్ని చూసి వివాహం చేసుకోవడం జరిగింది. సీతమ్మగారు జోగాన్న గారితో కలిసి అత్తవారి ఊరు అయిన లంకల గన్నవరం చేరుకోవడం జరిగింది.
ఆదరణ ఆప్యాయత గా కొసరి కొసరి తినిపించడం ఒక స్త్రీ కే చెల్లింది. మాతా అన్నపూర్ణేశ్వరి బిక్షాందేహి అంటూ స్త్రీ నామం తోటే యాచకులు బిక్షాటన చేస్తారు. ఆడ జన్మనెత్తిన ప్రతి మనిషి కరుణామూర్తి. వేళకాని వేళలో వచ్చిన వండి వార్చడం వారికి అలవాటు. సీతమ్మ గారిలో ఈ సుగుణాలు ఏవీ తక్కువగా లేవు.
ఆరోజుల్లో లంకలగన్నవరం అతివృష్టి అనావృష్టి పరిస్థితుల వల్ల ప్రజలు ఆకలి బాధతో అలమటించే వారు.
గోదావరి దాటాలంటే పడవ సాధనం. గోదావరి మధ్య దారిలో సీతమ్మ గారి ఊరు ఉండేది. ఏ వేళలో వచ్చిన ప్రయాణీకులు అందరికీ శుభ్రంగా అన్న పానీయాలు సమకూర్చడం ఆ దంపతులకు అలవాటుగా మారింది. దాని ఏనాడు శ్రమ అని అనుకోలేదు. పవిత్ర కార్యంగా భావించేవాళ్ళు ఆ దంపతులు.
ఒకసారి సీతమ్మగారు అంతర్వేది తీర్థం కి పడవలో బయల్దేరారు . మధ్యలో వేరొక పడవలో ఒక పిల్ల ఏడుపు వినిపించింది. ఆ తల్లి సీతమ్మ గారి ఇంటికి వెళ్ళిపోదాం పట్టెడన్నం పెడతారు. ఏడవకే తల్లి అంటూ పిల్లను సముదాయిస్తోంది. దాన్ని చూసి సీతమ్మగారు మార్గ మధ్యలో నుంచి పడవ వెనకకు తిప్పించి ఆ యాత్రికులు వచ్చే సమయానికి వండి వార్చి వారి ఆకలి తీర్చిందని కథలు చదవడం జరిగింది.
చివరి దశలో కాశీకి పోదామనుకున్న రోజు బండి ఎక్కినా ఆమె దిగి యాత్రికుల ఆకలి తీర్చడం చెప్పుకోదగ్గ విషయం.
ఆమె ఏనాడు చందాల రూపంలో గాని విరాళాల రూపంలో గాని డబ్బు ఆశించలేదు. వారు ఆస్తంతా దానధర్మాలకు ఖర్చు చేసినట్లుగా చరిత్ర చెపుతోంది.
ఆమె దాతృత్వం గురించి ఇంగ్లాండ్ మహారాణి తన పట్టాభిషేక మహోత్సవానికి రమ్మని ఆహ్వానించడం జరిగింది. సీతమ్మ గారు అందుకు అంగీకరించలేదు .తాను కీర్తి కోసం ఏ పని చేయలేదని అన్నార్తులను ఆదుకోవడం తన లక్ష్యం అని చెప్పడం జరిగింది. ఫోటో తీసుకోవడానికి కూడా అంగీకరించలేదు. కలెక్టర్ గారు ఉద్యోగం నిలబెట్టడం కోసం ఫోటో తీసుకోవడానికి అంగీకరించారు.
ఇంగ్లాండ్ రాణి తన పట్టాభిషేక సమయంలో ఈ ఫోటోలో ఒక కుర్చీలో ఉంచుకొని తన పట్టాభిషేకం జరిపించడం జరిగింది.
చదువు సంధ్యలతో నిమిత్తం లేదు. ఆమెకు ఉన్న ఒకే ఒక్క ప్రతిభ దానగుణం. ఎదుటి వారి ఆకలిని కని పెట్టడo.
ఇంతకన్నా స్ఫూర్తి మనకు ఎవరు ఇవ్వగలరు. మన పూర్వీకులు మనకు స్ఫూర్తి. తదుపరి ఆస్తంతా కరిగిపోయినా ఆమె నిత్యాన్నదానం కొనసాగిస్తూనే ఉంది.
ఒక రోజు ఆమె భర్త పొలం దున్నుతుండగా బంగారు నాణెముల పెట్టి దొరకడం జరిగింది.
ఈ కథను పదేపదే చదవడం వల్ల మనం స్పూర్తి పొందుతాము.
ముఖ్యంగా యువత ప్రతి ఆదివారం ఒకరి ఆకలి తీర్చే ప్రయత్నం చెయ్యడం అలవాటు చేసుకోవాలి. శ్రద్ధ పెట్టాలి. ఆ రకంగా చేస్తే ప్రతి వారికి ఆత్మ సంతృప్తి ఉంటుంది. దీనికి కోట్లాది రూపాయల డబ్బు అవసరం లేదు. ఆ మహాతల్లి ఎక్కడ ఉన్నా చాలా సంతోషించడం జరుగుతుంది. ఇలా చొరవ తీసుకుని చెప్పినందుకు క్షంతవ్యుణ్ణి.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
కాకినాడ
9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి