నిశ్శబ్ద అనుబంధం
నిశ్శబ్ద అనుబంధం.
ఏడు అడుగులు కలిసి నడిచాం
సంసార రథ చక్రాలయ్యాం
ఎన్నో అమృతం కురిసిన రాత్రులలో తడిసి
మధుస్మృతులను మిగిల్చుకున్నాం.
కష్టాల కడలిని అనురాగంతో ఈడ్చుకుంటూ వచ్చి
మన అనురాగానికి తీపి గుర్తులను తెచ్చుకున్నాం.
బాధ్యతలు అన్నీ బంగారు గూటిలోకి చేర్చి
హమ్మయ్య అనుకుని నాకు నువ్వు నీకు నేను
తొలి రోజులు గుర్తు చేసుకుని గువ్వల్లాగా మిగిలిపోయాo.
గూడు దాటి బయటకు అడుగుపెడితే
సందు చివర వరకు వీడ్కోలు పలికే నాకు
గుండెలో ఉన్న మాటని నా చెవిని
చేర్చే వరకు ఎప్పుడూ ఊరుకోని నీ మనసు
ఎందుకు చెప్పలేదో నువ్వు ఒంటరిగా
తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతున్నావని
ఇన్నాళ్లు మన మధ్య దాపరికాలు లేవు
ఇప్పుడే నేర్చుకున్నావు ఈ కొత్త విద్య
నేను అది తెలుసుకునే లోపలే
నువ్వు గుప్పెడు బూడిదిగా మారిపోయావు.
నా గుండె బద్దలు కొట్టి.
ఏదో కాలం గడుపుతున్నాను
జీవచ్ఛవంలా బతుకుతున్నాను
నా మనసు ఎప్పుడో నీతో పాటు
కాలగర్భంలో కలిసిపోయింది.
ఎప్పుడో నువ్వే చెప్పావు
భార్యాభర్త అంటే
అర్ధనారీశ్వర స్వరూపమని
సతీసహగమనం దురాచారమన్నారు
అందుకే మనసు లేని శరీరంతో బతుకుతున్న.
మరణం కోసం ఎదురు చూస్తున్న.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి