అమ్మ కన్నీళ్లు

అమ్మ కన్నీళ్లు

అమెరికా నుండి చెప్పా పెట్టకుండా ఇంటికి వచ్చిన రాజశేఖర్ ని తల్లి సీతమ్మ చూసి ఒక్కసారి అలా ఉండిపోయింది. కొడుకును గట్టిగా కౌగిలించుకుని తల మీద ముద్దు పెట్టుకుంది . ఆ సమయంలో తల్లి సీతమ్మ కళ్ళలో తడి కనిపించింది రాజశేఖర్ కి. 

అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు ఎప్పుడూ చూడలేదు రాజశేఖర్. కన్నీళ్లు కార్చవలసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆమె జీవితంలో. 

రాజశేఖర్ తండ్రి పోయినప్పుడు, అత్తవారు ఆస్తి ఇవ్వకుండా ఏడిపించినప్పుడు, ఒక పూట తిని రెండో పూట మంచినీళ్లు తాగి పడుకున్నప్పుడు, రాజశేఖర్ తండ్రి చేసిన అప్పులు తీర్చలేకపోతే అప్పులు వాళ్ళు ఇంటి మీద పడి గొడవ చేసినప్పుడు ఎప్పుడు ధైర్యంగా సమస్యలను ఎదుర్కొనేది. 

రాజశేఖర్ తండ్రి పోయేటప్పటికి సీతమ్మ వయసు ముప్పై సంవత్సరాలు. సీతమ్మ తల్లిదండ్రులతో సహా అందరూ రెండో పెళ్లి చేసుకోమని ఎంత బలవంత పెట్టినప్పటికీ ఎప్పుడూ ఆమె కళ్ళు రాజశేఖర్ మీదే ఉండేవి. సీతమ్మ తల్లిదండ్రులు రాజశేఖర్ ని దత్తత తీసుకుంటామని చెప్పినప్పటికీ సీతమ్మ ససేమేరా ఒప్పుకోలేదు. 

చిన్నప్పుడు రాజశేఖర్ ఆడుకుంటూ క్రింద పడిపోయినప్పుడు 
ఏమి కంగారు పడకుండా ఏడవకూడదు అంటూ ధైర్యం చెప్పేది తల్లి సీతమ్మ. అలాగే రాజశేఖర్ జీవితంలో అనేక కష్టాలు వచ్చినప్పటికీ ఎప్పుడు ధైర్యంగా అన్నింటికీ నేనున్నానని నిలబడే సీతమ్మ ఎందుకు ఇలా అయిపోయింది అని ఆలోచించసాగాడు రాజశేఖర్ .
అలా నెల రోజులు గడిచాయి. ప్రతిరోజు ఇద్దరూ కలిసి భోజనం చేయడం కూర్చుని కబుర్లు చెప్పుకోవడం సినిమాలు కి వెళ్లడం గుడికి వెళ్లడం ఇలా ఒక్కరోజు కూడా తల్లిని విడిచి ఉండలేదు రాజశేఖర్. 
ఒకరోజు సీతమ్మ రాజశేఖర్ చిన్నప్పటి సంగతులన్నీ చెబుతూ ఒకరోజు నువ్వు మీ నాన్న గురించి పదేపదే అడగడం ప్రారంభించావు. చచ్చిపోయాడని చెప్పడం నాకు ఇష్టం లేదు. పైకి వెళ్ళిపోయారు అని చెప్పేదాన్ని. ఆ మాటకు నీకు అర్థం తెలియదు. చెప్పిన అర్థం చేసుకోలేనీ వయసు నీది అలా అని చెబుతూ గొంతులో వణుకు ప్రారంభమైంది. " ఏమైంది అమ్మ అని రాజశేఖర్ అడిగే లోపల ఒక కన్నీటి చుక్క కింద పడింది. ఎందుకు బాధపడుతున్నావు? అని అడిగాడు రాజశేఖర్. 
"నువ్వు చిన్నప్పడు ఏడిస్తే నీ కళ్ళు తుడవడం నా పని! నీకు అన్ని విధాలుగా తోడుగా ఉండేదానిని. "నాకున్న ఒక్క కొడుకు దూరంగా ఉంటే నా కన్నీళ్లు తుడిచే వాళ్ళు లేరు బాబు ! అంది సీతమ్మ.

రాజశేఖర్ కి వెంటనే చెంప మీద కొట్టినట్టు అయింది. నిజంగా తల్లిదండ్రులను ప్రేమిస్తున్నామా! వారి ఒంటరితనాన్ని పోగొడుతున్నామా ! కొడుకుగా ఆలనా పాలన చూసుకుంటున్నామా! లేదు అనే సమాధానం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తల్లిదండ్రులు పడే మనోవేదన చూస్తే మనకు అర్థమవుతుంది. 

ఎన్నో రకాలైన త్యాగాలు చేసి పెంచి పెద్దవాడిని చేసి చదువు సంధ్యలు నేర్పించింది. ఇప్పుడు నా అభివృద్ధి కోసం నా సంతోషం కోసం విదేశాలకు పంపించి త్యాగం చేసింది 
 ముసలి వయసులో ఒంటరిగా ఉంటూ పిల్లలు ఎప్పుడు వస్తారు అని ఎదురు చూస్తూ కాలం గడుపుతోంది. 
 రాజశేఖర్ కి ఒకసారి ఏడుపొచ్చింది. రాజశేఖర్ వెంటనే లేచి సీతమ్మ కన్నీళ్ళని తుడిచే ప్రయత్నం చేశాడు. కానీ గుండెల్లో కన్నీళ్లు ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. ఆ కన్నీళ్లు పోవాలంటే ఏం చేయాలో రాజశేఖర్ కి అప్పుడు తెలిసింది. ఆ దిశగా ప్రయత్నాలు సాగించాడు.

రచన మధు నా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట