మా చాకిరేవు
మా చాకిరేవు
మన తెలుగు గడ్డలో చెరువు లేని ఊరు అంటూ ఉండదు. పల్లెటూరికి చెరువుకి అవినాభావ సంబంధం ఉంది. మంచినీళ్ళకి పశువులు కడగడానికి మరియు ఇతర అవసరాలకు రకరకాల చెరువులు ఉంటాయి. అందుకే చెరువు ప్రాముఖ్యతను చెబుతూ ఒక కవి తన రచనలో "నేను నిండుకుంటే మీకు పండగ ఎండిపోతే మీ బ్రతుకు దండగ" అంటాడు. చెరువులోని నీళ్లే కాదు చెరువుగట్టు కూడా చాలా ఉపయోగం. కాలక్షేపానికి అనువైన ప్రదేశo.. చాలా ఊళ్ళల్లో సాయంకాలం అయ్యేసరికి అక్కడ ఉండే బెంచీల మీద ఊరి వారందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు.
అలాగే మా ఊర్లో కూడా ఒక చాకలి చెరువు ఉంది. దాని పేరు ముద్దుగా చాకిరేవు. ఊరి మొదట్లోనే ఉంటుంది. ఏ ఊరు బాబు ఊరి పేరు చెప్పు అంటే మా ఊరి పల్లిపాలెం కాజులూరు మండలం కాకినాడ తాలూకా.
కానీ మా ఊరు చెరువు దగ్గర ఊరి వారు ఎవరు ఉండరు కానీ ఒక సామాజిక వర్గానికి చెందిన వారు దానిమీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఊరి మొదట్లో అమ్మవారి గుడి దగ్గరలో విశాలమైన చెరువు, చెరువు చుట్టూ ఒక గట్టు గట్టుమీద బట్టల మూటలు ,చెరువులో మోకాళ్ళ లోతు నీళ్లలో బట్టలు మురికి వదల కొడుతున్న రజక కులస్తులు ,
చెరువు లోపల చుట్టూ బండ రాళ్లు ,ఆ బండరాళ్ళ మీద బట్టలు ఉతుకుతున్నప్పుడు ఆ రజక కులస్తుల నోటి వెంట నుండి వచ్చే విచిత్రమైన ధ్వనులు దూరంగా పొయ్యి మీద చాకలి బానలు ,ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న చద్ది ముంతలు, ఇసుకలో ఆడుకుంటున్న పసిపిల్లలు,
దూరంగా దండెం మీద వేలాడదీసిన బట్టలు గాలికి ఎగురుతున్న శబ్దం, ఆరిపోయిన బట్టల మూటలు ఇవి మనకు అక్కడ కనిపించే దృశ్యాలు. తెల్లవారుజామున కోడి కూయక ముందే బట్టల మూట భుజాన్ని వేసుకుని కర్తవ్య నిర్వహణకి ఆ గట్టు చేరే ఆ రజక కులస్తులు ప్రతిరోజు మనకు దర్శనం ఇస్తారు.
ఊరివారి బట్టల మురికినంత పోగొట్టే ఆ రజక కులస్తులు గ్రామంలోని ఇళ్లను పంచుకుని నెలకో పదిహేను రోజులకు ఒకసారి మాసిపోయిన బట్టలను దండుకుని బానలో ఉడకబెట్టి బండ కేసి బలంగా కొట్టి ఇత్తడి పెట్టితో ఇస్త్రీ చేసి తెల్లగా మెరిసిపోతున్న బట్టలను మళ్లీ మనకు అందజేస్తారు. ఆ బట్టలు చూస్తే వెంటనే కట్టుకోవాలని అనిపించేది. అంత పరిశుభ్రంగా ఉతికేవారు. అది వాళ్ళ కులవృత్తి అయినప్పటికీ కొన్ని కోట్ల జన్మలెత్తినప్పటికీ మనం వాళ్ళ రుణం తీర్చుకోలేం.
అప్పట్లో అలా ఉండేది గ్రామాల్లోని పరిస్థితి. యజమాని ఏమి ఇస్తున్నాడు వాళ్లు ఏం తీసుకుంటున్నారు అనేది ఎవరికి తెలియదు. శుభకార్యమైన అశుభ కార్యమైన ఆ సామాజిక వర్గం వారి చెయ్యి పడందే ఆ కార్యక్రమం ముందుకు సాగేది కాదు. అది గ్రామాలలోని ఆచారo
అలా ప్రతి ఇంటి దగ్గర నుంచి మురికి బట్టల్ని వర్గాల వారీగా రికార్డు చేయడం మళ్లీ ఆ రికార్డు ప్రకారం బట్టల్ని అప్పజెప్పడం వారి బాధ్యత. పూర్వకాలంలో ఆడపిల్లలకి చాకలి పద్దు రాయడం వస్తే చాలు అని చదువులు ఆపేసే వారు.
ఆనాటి కుటుంబ వ్యవస్థలో చాకలి పద్దుకి అంత ప్రాముఖ్యత ఉండేది. ఈనాటి యువతరానికి చాకలి పద్దు అంటే ఏమిటో తెలియదు. కొంతమంది బట్టలు ఆనమాలు తెలియడానికి బట్టల మీద ఎక్కడో అక్కడ ఒక గుర్తు పెట్టుకునే వారు. చాలా జాగ్రత్త పరులని చెప్పచ్చు.
మనదేశంలో ప్రతి వృత్తిలోనూ కూడా వారు ఉపయోగించే పనిముట్లనీ పూజించడం ఆచారంగా ఉండేది. ఉదాహరణకి కనుమ పండుగ రోజున పశువులకు పూజలు చేస్తారు. విజయదశమి రోజున వాహన పూజ చేస్తారు. వినాయక చవితి రోజున పుస్తకాలకు పూజలు చేస్తాం. మరి సంవత్సరంలో ఏదో ఒక రోజున ( ఆరోజు గుర్తులేదు) ఈ సామాజిక వర్గం వారు నిత్యం ఉపయోగించే బట్టలుతికే బండలకి పూజలు చేస్తారు. బలులు ఇస్తారు. పండగ చేసుకుంటారు. అప్పుడే వారి వృత్తికి కొద్దిరోజుల పాటు విరామం.
ప్రతినిత్యం సందడిగా ఉండే ఆ చెరువు గట్టు సంక్రాంతి సమయంలోను అమ్మవారి జాతర సమయంలో జరిగే కోడిపందాల లో వీర స్వర్గం పొందిన కోడిపుంజుల అవశేషాలతో నిండిపోయి ఉంటుంది. బరిలో దిగవలసిన కోడి పుంజులను ఎత్తుకొని కొందరు, బెట్టింగులు కాసే ముఠా కొందరు ఆ గట్టు మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు.
ఆ చెరువు ఎవరి తవ్వించరో ఎప్పుడు తవ్వించారో లెక్కలు నేను ఎరగను. చెప్పుకోవడం కూడా వినలేదు. ఊరు మొదట్లో ఆ చెరువు చూడగానే అమ్మయ్య మన ఊరు వచ్చేసాము అనే సంతృప్తి కలిగేది అప్పట్లో . ఇది మంచినీళ్ళ చెరువు కాకపోయినా దీనికి మా గ్రామంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఊరి వారందరి బట్టల మురికిని తరతరాలుగా అదే వదలగొట్టేది. మన మాట అలా ఉంచితే ఒక ఊరిలో చెరువు ఉంటే దాంట్లో ఎన్ని రకాల జలచరాలకు అది నివాసమవుతుందో బ్రతకడానికి ఆధారం చూపుతుందో మనం చెప్పక్కర్లేదు. ఆకాశంలో ఎగిరే పక్షులకి గొంతు తడారి పోతే మన చెరువు దాహం తీర్చడానికి ఉపయోగపడుతుంది.
మా చాకిరేవులో మురికి బట్టలు మూడు మునకలు వేస్తాయి కానీ పోరగాళ్లు ఈత కొట్టడానికి వీలు లేదు. అది నిషిద్ధ ప్రదేశం. అక్కడ మురికి బట్టలకే ప్రవేశం. రోజు అమ్మవారిని కను సన్నలలో ఉండి ప్రక్కన బసవయ్యని పెట్టుకుని ఊరు వారికి అందరికీ మహోపకారం చేస్తున్న ఆ చెరువు అదే మా చాకిరేవు ఎలా మర్చిపోతాం. ఊరి జ్ఞాపకాల్లో అది కూడా ఒకటే. తరాలు మారిపోతున్నాయి. అలా చెరువు అలాగే ఉంది. ఊరు నాగరికత నేర్చుకుంది . చెరువు ఎప్పటిలాగే సేవలు చేస్తూనే ఉంది. పరోక్షంగా పదిమంది బతకడానికి ఉపయోగపడుతోంది .
ఇది మా చాకిరేవు .
రచన. మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి