సీత జీవితం

సీత జీవితం 

ఇల్లంతా పెళ్లి సందడితో హడావిడిగా ఉంది. గుమ్మానికి మామిడి తోరణాలు ఆకాశమంత పందిరి హాలంతా డెకరేషన్ చాలా అందంగా ఉంది. అక్కడ హల్దీ కార్యక్రమానికి డ్యాన్సులతో బంధువులంతా బిజీగా ఉన్నారు. పెళ్లికూతురు సీతాదేవి గారిని రెండు చేతులుండా గోరింటాకు పెట్టి కుర్చీలో కూర్చోబెట్టారు. కొందరు గోరింటాకు పెట్టించుకునే హడావుడిలో కొందరు డాన్స్ లు హడావిడిలో హాలు అంతా ఆనందంగా ఉంది.

 పెళ్లి పెద్దలు ఇద్దరూ హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు. వథూవరుల వయసు ఎంత ఉంటుందో ఊహించగలరా . ఇద్దరు వృద్ధ దంపతులు . ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇంతకీ పెళ్లి కూతురు ఎవరు. ఇద్దరు బిడ్డల తల్లి . కడుపున పుట్టిన పిల్లలు తల్లికి పెళ్లి చేయడం మరీ వింతగా ఉంది కదా. వింత కాదండి. ఇంతకీ పెళ్లి వెనుక అసలు కథ ఏమిటి.

సీతా దేవి గారు తల్లిదండ్రులకి ఏకైక కుమార్తె. తండ్రి నారాయణ మూర్తి గారు వేద పండితుడు. ఆచార సాంప్రదాయాలకు విలువనిచ్చేవాడు. లేక లేక పుట్టిన ఆడపిల్లని
చాలా కట్టుబాట్లుతో పద్ధతిగా పెంచాడు. ఆ ఊర్లో ఉండే ప్రాథమిక విద్య తోటి చదువు ఆపించేసి ఇంటి వద్దనే సంస్కృత పాఠాలు పురాణాలు సంగీతం నేర్పించాడు. సీతా దేవి గారు కూడా చాలా అందంగా ఉండేవారు. 
తెల్లగా మంచి పుష్టిగల విగ్రహం. చూడగానే అందర్నీ ఇట్టే ఆకట్టుకునేది. చాలా చురుకు అయిన పిల్ల. మంచి సంగీతం కూడానేర్చుకుంది. వంటావార్పు నేర్చుకుంది. బంధువుల్లో చాలా పద్ధతి గల పిల్లని పేరు తెచ్చుకుంది. సీతాదేవి గారి తండ్రి కూడా పదిమంది శిష్యులకు ఎప్పుడు వేదపాఠాలు అరుగు మీద చెప్తూ ఉండేవాడు. ఎత్తయిన అరుగులు చుట్టూ మొక్కలతో ఆ ఇల్లు చూడగానే ఉద్యానవనంలా ఉండేది. ఆ చుట్టుపక్కల పది గ్రామాలకు ఆయనే పౌరోహిత్యం చేసేవారు. వచ్చే పోయే జనంతో ఎప్పుడూ సందడిగా ఉండేది ఇల్లు.

అలాంటి ఉద్యానవనంలో పుట్టిన మొగ్గ వికసించి పువ్వుగా మారింది. దూరపు బంధువుల పెళ్లిలోనారాయణమూర్తి గారు మంచితనం సీతాదేవి గారి అందం చూసి వేలు విడిచిన మేనత్త కొడుకు రామారావు పెళ్లి చేసుకుంటానని కబురు పంపాడు. రామారావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ గా పని చేస్తున్నాడు. రామారావు కూడా చాలా అందగాడు . తల్లిదండ్రులకి ఏకైక కుమారుడు. పెళ్ళివారు కట్న కానుకలు ఏమి వద్దని జాతకాలు తమకు పట్టింపు లేదని ఐదు రోజుల పెళ్లంటే తమకుసరదాఅని ముహూర్తాలు పెట్టించమని కబురు చేశారు.

నారాయణ మూర్తి గారికి ఆనందానికి హద్దు లేదు. అయినప్పటికీ ఒకసారి పక్క ఊర్లో ఉన్న సిద్ధాంతి గారి చేత జాతకాలు చూపించుకుని ముహూర్తాలు పెట్టించేసా రు.
అనుకున్న ప్రకారం ఆకాశమంత పందిరి వేసి భూదేవి అంత అరుగు మీద బంధు వర్గాన్ని అందర్నీ పిలిచి పెళ్లి బ్రహ్మాండంగా చేసి కూతుర్ని రాజమండ్రి లో కొత్త కాపురం పెట్టించి వచ్చేసారు నారాయణమూర్తి గారి దంపతులు.

సీతాదేవి గారికి పెళ్లి అయితే అయింది కాని అంతకు సరిపడా వయసు అయితే లేదు. మంచి సంబంధం దొరికింది కదా అని పెళ్లి చేసేసారు.రామారావు గారికి సీతాదేవికి తొమ్మిదేళ్ళు తేడా
రామారావు గారికి డిగ్రీ కాగానే ప్రొబిషనరీ ఆఫీసర్ కింద ఉద్యోగం వచ్చేసింది. కొత్త కాపురం . కొత్త వాతావరణం

 అంతవరకు పల్లెటూర్లో ఉండి సిటీకి వచ్చిన సీతాదేవి గారికి అంతా కొత్త కొత్తగా ఉంది. రామారావు గారి ప్రతిరోజూ ఉదయం తొమ్మిది గంటలకు టిఫిన్ తినేసి క్యారేజీ పట్టుకుని ఆఫీస్ కి వెళ్ళిపోయేవాడు. మళ్లీ రాత్రి తొమ్మిది గంటలకు కానీ ఇంటికి వచ్చేవాడు కాదు. సీతాదేవికి మధ్యలో ఒంటరిగా ఇంట్లో ఉండే ది. కాలం గడిచేది కాదు. ఆదివారం పూట మాత్రం ఇంటికి కావాల్సిన సామాన్లు కూరగాయలు తెచ్చుకుని బయట హోటల్లో భోజనం చేసి సినిమాకు వెళ్లి రాత్రి లేటుగా పడుకునేవారు.

ఒకసారి రామారావు గారిని బ్యాంకుకు పంపించి వీధి తలుపు వేస్తుండగా ఎదురింటి ఇంట్లో ఉండే ఆవిడ నవ్వుతూ పలకరించింది . అలా ఒకరినొకరు పరిచయాలు అయ్యాయి. తనకు కూడా చిన్న వయసులోనే పెళ్లి చేసేసారని టైం గడవక ఈ మధ్యనే మెట్రిక్ కట్టాను అని రోజు ట్యూషన్ సెంటర్ కు వెళ్లి చదువుకుంటానని ఎదురింటి ఆవిడ చెప్పింది. ఇదే మాట రామారావు గారితో చెప్పగా భర్త ఆమెను కూడా చదువుకోమని 
ప్రోత్సహించాడు ఆలస్యం చేయకుండా మొన్నాడే ట్యూషన్ సెంటర్ లో చేరి మెట్రిక్ పరీక్ష ఫీజు కట్టేసి చదువు మొదలుపెట్టింది.

అటు చదువుతోటి ఇటు కొత్త కాపురం తోటి కాలం ఏమీ తెలియడం లేదు. రోజుల ఆనందంగా గడుస్తున్నాయి. సీతాదేవి గారి సహజంగానే తెలివైనది కావడం చేత మెట్రిక్ పరీక్ష ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. రామారావు గారికి కూడా ప్రమోషన్ మీద పక్క బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ అయింది . రోజు రాజమండ్రి నుంచి వెళ్ళొస్తున్నాడు.

కాలo ఎప్పటికీ ఒకలా ఉండదు. అనుకోని మార్పులు వస్తుంటాయి. కాలం అందరికీ ఒకటే కానీ కొందరికి కొన్ని సమయాల్లో మంచిని మరికొందరికి కొన్ని సమయాల్లో చెడుని
అదే కాలం తీసుకొస్తుంది.

రామారావు కూడా తన ఫ్యామిలీని పెద్ద ఇంట్లోకి మార్చేసాడు. ఖరీదైన గృహపకరణాలన్నీ ఇంట్లో కి రాసాగాయి. పండక్కి పబ్బానికి మంచి మంచి చీరలు బంగారం కొనిచ్చి సీతాదేవి గారిని చాలా అపురూపంగా చూసుకుంటున్నాడు. 
 అకస్మాత్తుగా ఎంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో సీతాదేవి గారికి అర్థం కాలేదు. కానీ భర్తని ఎప్పుడూ ప్రశ్నించలేదు.పైగా సీతాదేవి గారు కూడా ఒట్టి మనిషి కూడా కాదు. మూడు నెలల గర్భిణీ. రామారావు గారు ఆనందానికి అంతులేదు. సీమంతానికి పుట్టింటికి పంపించకుండా ఒక స్టార్ హోటల్లో భారీ ఎత్తున పార్టీ ఏర్పాటు చేసి భారీ బహుమతులు ఇ చ్చి అందర్నీ సాగనంపాడు.

సీతాదేవి గారు పురిటి కోసమని పుట్టింటికి వెళ్లారు. ఒకరోజు అకస్మాత్తుగా పిడుగులు లాంటి వార్త తెలిసింది. రామారావు గారి పని చేసే బ్యాంకును మోసం చేసి డబ్బు తీసుకుని పారిపోయారని పోలీసులు రామారావు గారిని వెతుకుతున్నారని బంధువుల ద్వారా కబురు తెలిసింది.
 అసలే గర్భిణీ ఈ వార్త విని తట్టుకోలేకపోయింది.
అంత మంచిగా ఉండే మనిషి ఈ రకంగా ఎందుకు మారిపోయాడు. ఆకర్షణకు లోనయ్యాడా. డబ్బంటే మోజు పెరిగిందా. దీనిలో తన పాత్ర ఎంత . తను కని పెట్టుకోకపోవడం తన తప్పిదమే కదా. భార్య పాత్ర ఆడిటర్ లాంటిది అంటారు
 భర్త సంపాదనకు అన్నీ లెక్కలు అడుగుతూ ఉండాలి. అటువంటప్పుడే కట్టడి ఉంటుంది. 

ఇలా ఆలోచించుకుంటూ పుట్టబోయే పిల్లల మీద తండ్రి ప్రభావం ఎలా ఉంటుందని కుమిలిపోతూ రోజులు భారంగా గడిపుతున్నారు సీతాదేవి. మూలిగే నక్క మీద తాటి పండు అన్నట్లుగా సీతాదేవి గారికి కవల పిల్లలు జన్మించారు. ఇద్దరూ మగ పిల్లలే. కవల పిల్లలు కాబట్టి రామలక్ష్మణులు అని పేరు పెట్టింది.ఒకపక్క ఆనందం మరొక పక్క విచారం ఇలా సాగిపోతుంది ఆమె జీవితం. పెళ్లయిన రెండు సంవత్సరాలకే జీవితం అంత కష్టాలు పాలైంది. మొగుడు ఉన్న లేనట్టే లెక్క. ఎక్కడున్నాడో తెలియదు. ఎప్పుడొస్తాడో తెలియదు వస్తాడోరాడో తెలియదు. వచ్చినా జైలు తప్పదు. భవిష్యత్తు అంతా గందరగోళంగా తయారయింది. ఇలా మూడు సంవత్సరాలు గడిచాయి. కూతురు భవిష్యత్తు గురించి బెంగతో సీతాదేవి తల్లిదండ్రులు పల్లెటూర్లో ఉన్నదంతా అమ్మేసి సీతాదేవిని పిల్లల్ని తీసుకుని కాకినాడకి మకాo మార్చేసి 
పిల్లలు ఇద్దరినీ స్కూల్లో చేర్పించారు.

పిల్లలు ఇద్దరు తండ్రి గురించి వేసే ప్రశ్నలు కు సమాధానం చెప్పలేక సీతాదేవి గారు తనలో తానే కుమిలి పోయేవారు.
పిల్లలు ఇద్దరు రామారావు గారు లాగా అందంగా తెలివిగా ఆటపాటల్లోనూ చదువులోనూ అన్నింటిలోనూ ఫస్ట్. అలా రామలక్ష్మణులు ఇద్దరూ అమెరికాలో ఎమ్మెస్ చేసి మంచి ఉద్యోగాలలో స్థిరపడిపోయారు.ఈలోగా సీతాదేవి గారి తల్లిదండ్రులు వయో భారం చేత కాలం చేశారు.

 రామలక్ష్మణులు ఇద్దరు అమెరికాలో స్థిరపడిపోయి తల్లికి ఒక మంచి ఇల్లు కాకినాడలో కొనిచ్చి ఓ ఏడాదికో ఆరు నెలలకు వచ్చి చూసి వెడుతూ ఉండేవారు

పిల్లలు ఇద్దరు బాధ్యత తీరిపోయింది. లంకంత ఇల్లు చేతినిండా పనివాళ్ళు. కాలు కింద పెట్టక్కర్లేదు. చేతినిండా డబ్బు అయినా ఏదో మానసిక అసంతృప్తి. ఒంటరితనం. ఆత్మీయులు ఎవరూ దగ్గరగాలేరు. ఈ వయసులో అమెరికాలాంటి ఊళ్ళల్లో ఉండడం అంటే కత్తి మీద సామే. ముఖ్యంగా అక్కడ ఈ వయసు వాళ్లకు తోచదు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. ఇంట్లో పని చేయగలిగేంత ఓపిక ఈ వయసు వారికి ఉండదు. సీతాదేవి పెద్ద వయసు ఏమి కాదు. 

రామలక్ష్మణులు ఇద్దరికి తల్లి గురించి బెంగ పట్టుకుంది. సీతాదేవి గారికి ఎప్పుడు ఫోన్ చేసినా ఏదో ఆలోచిస్తున్నట్లు ఉంటున్నారు. అడిగినదానికి మాత్రమే సమాధానం చెప్తున్నారు. ఒకవేళ ఆరోగ్యం బాగాలేదా. పైకి బాగానే ఉన్నారు. ఒంటరితనం ఫీలవుతున్నట్లుగా తెలుస్తోంది. కష్టాలన్నీ దాటి వచ్చి సుఖపడవలసిన వయసులో ఆమె ఎందుకు ఇలా ఉంటోంది. ప్రశ్నలకు సమాధానం ఒక్కటే తోస్తోంది. ఒంటరితనమే ఆమె జీవితానికి పెద్ద శాపం. ఆ ఒంటరితనానికి ఏం చేయాలి. ఇలా పిల్లలు తల్లి గురించి ఆలోచిస్తూ తల్లికి ఈ వయసులో తప్పకుండా ఒక తోడు కావాలి. అది మనసు పంచుకునే తోడు. ఎవరినైనా ఇచ్చి పెళ్లి చేస్తే. నో అమ్మ అటువంటివి దానికి ఒప్పుకోదు. 
మరి ఇద్దరు కలిపి ఒక స్థిర నిర్ణయానికి వచ్చి రెండు నెలల సెలవు పెట్టి అమెరికా నుండి కాకినాడ వచ్చారు.పిల్లల్ని చూడగానే సీతాదేవి గారి మొహం విద్యుత్ బల్బుల వెలిగిపోయింది. తండ్రి పనిచేసే బ్యాంకు వివరాలు అడ్రస్సు
తల్లి దగ్గర నుండి అడిగి తీసుకుని బ్యాంకు ఉన్నతాధికారులను కలిశారు. రామారావు గారు 50 లక్షల వరకు బ్యాంకుసొమ్ము దుర్వినియోగం చేశారని ఈ మధ్యనే హైదరాబాదులో పోలీసులకు చిక్కి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారని తెలుసుకున్నారు. ఇంకా కోర్టులో కేసు నడుస్తోందని,బ్యాంకు సొమ్ము వడ్డీతో సహా చెల్లిస్తే రామారావు గారిని విడుదల చేయడానికి అభ్యంతరం ఏమీ లేదని బ్యాంకు ఉన్నతాధికారులు చెప్పారు.

రామలక్ష్మణులు ఇద్దరు తల్లికి ఈ విషయం చెప్పి తల్లిని తీసుకుని రామా రావు గారిని చూడడానికి రాజమండ్రి జైలుకు వెళ్లారు. రామారావు గారిని చూడగానే సీతాదేవి గారికి ఒకసారి దుఃఖం పొంగుకు వచ్చింది. రామలక్ష్మణులు ఇద్దరినీ పరిచయం చేసి విషయం టూకీగా చెప్పింది. బ్యాంకుకు జరిగిన నష్టమంతా వడ్డీతో సహా చెల్లిస్తానని తనని విడుదల చేయమని బ్యాంకు ఉన్నతాధికారులకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కోర్టు వారికి లాయరు ద్వారా అభ్యర్థన పత్రం రాయించి రిజిస్టర్ పోస్టులో పంపించారు. 

మరి అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి అంటూ సీతా దేవి గారు ప్రశ్న వేశారు. రామలక్ష్మణులు ఇద్దరు తమ భార్యల వద్ద ఉన్న బంగారాన్ని అమ్మే సి తండ్రిని విడుదల చేద్దామని చెప్పారు. బంగారం ఎప్పుడూ లాకర్ లోనే ఉంటుంది పెట్టుకుని తిరగడానికి ఈరోజుల్లో చాలా భయం ఎవరు ఎప్పుడు వచ్చి పీక నొక్కుతారో తెలీదు. కావాలంటే మళ్లీ కొనుక్కోవచ్చు. ఇంత తొందరగా డబ్బు రావాలంటే వేరే మార్గం లేదు. అని రామలక్ష్మణుల తన తల్లికి తమ ఆలోచన చెప్పారు.

ఈ లోగా బ్యాంకు వారు అంగీకార పత్రం కూడా వచ్చింది. కొన్ని సందర్భాల్లో నష్టానికి కూడా ఒక పని చేయవలసి ఉంటుంది. ఒక జీవితం స్థిరపడుతుందంటే ఒక జీవితంలో మంచి పని జరుగుతుందంటే ఆర్థికంగా మనం నష్టపోయిన కొన్ని పనులు మన వెంట వెంటనే చేయాలి. ఇక్కడ లాభ నష్టాలప్రసక్తి చూసుకుంటే నాన్న ఎప్పటికీ జైల్లోనే ఉంటారు . అమ్మ సమస్యసికి పరిష్కారం ఉండదు. ఈ వయసులో అమ్మ ఒంటరితనం భరించలేదు. ఎంతైనా కన్నతండ్రి కదా ఆయన సమస్య కూడా మనమే పరిష్కరించాలి అని రామ లక్ష్మణులు ఇద్దరు ఆలోచించుకుని బంగారం అమ్మేసి రామారావు గారిని జైలు నుండి విడుదల చేయించారు.

సీతాదేవి గారి ఆనందానికి అవధులు లేవు. అమ్మ నాన్న ఒక ఇంట్లో తిరగడం చూసి పిల్లల ఆనందంతో ఉప్పొంగిపోయారు.
మరి ఆనంద సమయంలో షష్టిపూర్తి వేడుక జరిపిస్తే తల్లి తండ్రి కూడా సంతోషిస్తారు అని రామలక్ష్మణులు నిశ్చయించుకుని
 ఏర్పాట్లు అన్నీ చేశారు. బంధువులందరినీ పిలిచారు.

పెళ్లికూతురు ముస్తాబులో సీతాదేవి గారు పెళ్ళికొడుకు హోదాలో రామారావు గారు మెరిసిపోతున్నారు. ఆ వయసులో చిన్నపిల్లలా సిగ్గుపడుతున్నారు. 

సీతాదేవి గారి మొహం లో కొత్త పెళ్లికూతురు ముఖంలో ఉన్నంత ఆనందంగా ఉంది. మంగళ వాయిద్యాల నడుమ రామారావు గారు సీతాదేవి గారి మెడ మూడు ముళ్ళు వేశారు. ఆహుతులంతా అక్షతలు జల్లి రామలక్ష్మణులను కూడా మనసారా దీవించి వెళ్ళారు.
తల్లిదండ్రులు ఇద్దర్నీ తీర్థయాత్రలకు పంపించి రామలక్ష్మణులు ఇద్దరు అమెరికాకు వెళ్లిపోయారు. వయసు వచ్చిన పిల్లలకు తల్లిదండ్రులు బాధ తీర్చడo కన్నా ఇంక ఏం కావాలి. అంది వచ్చిన పిల్లలు కొందరికి తల్లిదండ్రులకు ఉండే అప్పులు తీరుస్తారు. కొందరు ఇల్లు కట్టిస్తారు. కొందరు తీర్థయాత్రలకు పంపించి ఆనంద పడతారు. బాధ్యత కలిగిన పిల్లలకు ఒకరు చెప్పగా వచ్చేది కాదు ఇది. తల్లిదండ్రుల పరిస్థితిని బట్టి అనుగుణంగా పిల్లలు ప్రవర్తించాలి.అప్పుడే తల్లిదండ్రుల జన్మ సార్ధకం అవుతుంది. 
ఏనాడో తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం ఈనాడు ఇలా కొడుకుల రూపంలో వచ్చి జన్మనిచ్చిన తల్లిదండ్రుల సమస్యలు తీర్చారు.

 ఇది కథే కానీ కొంతమందికి కనువిప్పు కలిగిస్తుందని బాధ్యత గుర్తు చేస్తుందని ఆశిద్దాం.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
         కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట