ఊరి ముచ్చట్లు

ఊరి ముచ్చట్లు

 సంక్రాంతి పండగ అయిపోయిన తర్వాత పిల్లలందరూ రాబోయే వేసవికాలం కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. సంక్రాంతి పండక్కైతే పది రోజులు సెలవులు కానీ వేసవికాలం వచ్చిందంటే ఇంకేముంది రెండు మూడు నెలల పాటు పిల్లలకి ఆటవిడుపే. పెద్ద పరీక్షలు అయిపోతే అమ్మమ్మ గారి ఊరికి పరుగులు తీస్తుంటారు. 

అసలు రుతువు మారుతోందని మనకి ఎలా తెలుస్తుంది. వాతావరణంలో వచ్చే మార్పులే మనకి రుతువు మారిపోతోందని తెలుస్తుంది. 

మహాకవి పోతన గారు భాగవత గ్రంథంలో గ్రీష్మ రుతువు గురించి చెబుతూ పగటి సమయాలు అంతకంతకు పెరుగుతున్నాయని సూర్యుడు ఉత్తర దిక్కు వైపుకు సంచరిస్తున్నాడని ఎండ తీక్షణ రోజురోజుకీ పెరుగుతుందని భూమి నుండి లేచిన దుమ్ము రేణువులు ఆకాశమంతటా వ్యాపించి ఉన్నాయని సెలయేళ్లు కొలనులు ఎండిపోయాయి బాటసారులు చలివేంద్రాల వైపు అడుగులు వేస్తున్నారని పాములు ఎండలు భరించలేక పొదల్లో చేరిపోతున్నాయని చెట్లు పూలు వాడిపోయాయని అగ్నిదేవుడు అడవులతో ఆడుకుంటున్నాడని అద్భుతమైన వర్ణన చేశారు.

అలాంటి వాతావరణంలోని మార్పులతో ఆ ఊరికి అంటే మా స్వగ్రామం కాకినాడ తాలూకా కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామoలో కూడా వేసవికాలం అడుగుపెట్టేసింది. పాఠశాల గదులుకి తాళాలు పడిపోయాయి.పిల్లల సందడి మొదలైంది.

అలాంటి మండువేసవి కాలంలో ఎండ కాస్త చుర్రుమనిపిస్తే చెట్ల నీడ వైపు పరుగులు తీస్తాయి సమస్త ప్రాణికోటి. ఈ రుతువులో అందరూ చల్లదనం కోరుకుంటారు. దాహార్తి ఎక్కువగా ఉంటుంది. చల్లటి వస్తువులు తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఇప్పటి రోజుల్లో అయితే రకరకాల ఐస్ క్రీములు దుకాణాలు కిటకిటలాడుతుంటాయి. రహదారి పక్కన కొబ్బరి బొండాలు చెరుకు రసాలు పుచ్చకాయలు వీటి మీదే మన దృష్టి. ఇంకా అందమైన షాపుల షోకేసుల్లో మెరిసిపోయే రకరకాల కూల్డ్రింకులు జ్యూస్ షాపులు ఎక్కడ ఖాళీ ఉండవు. ఏదీ తట్టుకోలేడు మానవుడు.
ఇది ఇప్పటి మాట కాదు. యాభై ఏళ్ల క్రితం మాట ఆ ఊరు అప్పట్లో నిజమైన పల్లెటూరు. పాడైపోయిన కంకర రోడ్లు, పుంత రోడ్లు, బస్సు సౌకర్యం లేదు. వర్షాకాలం వస్తే ఇంక చెప్పుకునేది ఏముంది. కానీ స్వచ్ఛమైన గాలి ఇంటి వెనక పొలాల్లో ఎప్పుడో తాతలనాటి మామిడి చెట్లు, పశువుల పాకలు ,పచ్చటి పంట పొలాలు, కాలువలు ఇది మా ఊరు ప్రత్యేకతలు. ఊరు దాటి వెళ్లాలంటే ఒకవైపు పెద్ద కాలువ. ఊరి మొదట్లో అమ్మవారి గుడి ,అగ్రహారం చివరన శివ కేశవులు ఆలయాలు. ఎక్కడ చూసినా విశాలమైన దొడ్లు. ఇది మా ఊరి చిత్రం.
అలాంటి మండుటెండలో మధ్యాహ్నం పూట అరుగుల మీద కూర్చుని ఆటలాడుకుంటూ ప్రతిరోజు మధ్యాహ్నం ఒక వ్యక్తి కోసం సాయంకాలం మరొక వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. 
మధ్యాహ్నం పూట మండుటెండలో సైకిల్ తొక్కుకుంటూ ఆరడుగుల ఆజానుబాహుడు కాకి నిక్కర్ వేసుకుని పైన బనియన్ వేసుకుని వెనకాల సైకిల్ క్యారేజీకి ఎర్రటి నలు చదరపు డబ్బా కట్టుకుని చేతిలో రేకు డబ్బా మూత చప్పుడు చేస్తూ వస్తుంటే మా పిల్లల దృష్టి అంతా అటువైపే. నోళ్ళన్నీ లాలాజలంతో నిండిపోయేవి. అబ్బా కాసేపైనా చల్లదనం అనుభవించొచ్చు ఇంట్లో ఎలాగా ఫ్యాన్ లేదు. ఏసీ లేదు. అనుకొని ఆశగా ఎదురు చూసేవాళ్ళు కుర్రకారు.

కుర్ర కారు అంతగా ఎదురుచూసే వ్యక్తి ఎవరబ్బా! కుర్ర కారే కాదు తలలు పండిన వాళ్లు కూడా. ఇప్పుడైతే కాస్త ఎండమండితే అడుగడుగునా ఉండే ఐస్ క్రీమ్ పార్లర్ లోకి దూరిపోతున్నాం. అప్పుడు అలా కాదు. చల్లటి పదార్థం ఏది కొనుక్కోవాలన్నా 5 కిలోమీటర్లు వెళ్ళవలసిందే. ఈ దాహార్తిజనులను బ్రోచే శ్రీమన్నారాయణనుడు ఎవరు అనుకుంటున్నారు. అతని పేరు సాయిబు. ఐస్ ,పాల ఐస్ అంటూ వీధులు తిరిగే మహానుభావుడు ఆ ఊరికి. ఎందుకంటే ఆ ఊరి కోమటి కొట్లో కడుపు నింపే మరమరాలు తప్పితే కడుపుబ్బరం తగ్గించే గోలి సోడా కూడా దొరికేది కాదు. 

అలాంటి కుగ్రామానికి మధ్యాహ్నం పూట బతుకు తెరువు కోసం 
సైకిల్ తొక్కు కుంటూ చెమటలు కక్కుతూ వీధి వీధి తిరిగే ఆ సాయిబు కోసం ఎంతోమంది ఎదురుచూపు. మా వీధిలోకి రాగానే మా ఇంటి పందిట్లోకి ఒక్కసారి చూసేవాడు. అప్పటికే మొత్తం రెండు పదుల సంఖ్యలో పిల్లలు ఉండేవారు. 
భలే మంచి చౌక బేరం అనుకుంటూ పందిట్లోకి చేరి డబ్బాలోంచి తెల్లటి ఐస్ ఫ్రూట్ తీసి చేతిలో పెట్టగానే పిల్లల కళ్ళల్లో ఆనందం తొణికిసలాడేది. రోజుకో రంగు ఐస్ ఫ్రూట్ లు తీసుకొచ్చేవాడు. చుట్టూ చల్లటి మంచు ముక్క బొట్లు బొట్లుగా నీరు కారుస్తూ ఉంటే మధ్యలో ఉన్న ఒక వెదురు పుల్ల ఆధారంతో దాన్ని నోట్లో పెట్టుకుని చప్పరిస్తుంటే తియ్యగా చల్లగా ఇట్టే కరిగిపోయేది. మంచు ఎంతసేపు ఉంటుంది. కానీ కాసేపటి వరకు దాని అనుభూతి మన నాలిక అనుభవించేది. ఇంకేముంది మరి వీటన్నిటికీ ఒక దాత ఉండాలి కదా. ఆయన మా పెద్ద బావ గారు. హైదరాబాద్ నుంచి పిల్లలతో వేసవి సెలవులకి పల్లిపాలెం వచ్చేవారు. 

నాకు బాగా గుర్తున్నంతవరకు ఆ ఐస్ ఫ్రూట్ ఖరీదు 5 పైసలు అని గుర్తు. మా బావగారు బ్యాంకులో పనిచేసేవారు. ఒక రేకు డబ్బాలో నుంచి కొత్త అయిదు పైసలు బిళ్ళలు లెక్కపెట్టి ఆ సాయిబుకి ఇవ్వడం నాకు ఇప్పటికీ గుర్తుంది. కానీ మా పిల్లల దృష్టి అంతా ఐస్ ఫ్రూట్ మీద. ఆ ఐస్ ఫ్రూట్ మూలాన్ని మనకేనా ఉపయోగం ఉందా అంటే ఏమీ లేదు చల్లదనం అనుభవించడానికి మాత్రమే. అప్పట్లో అవి రెండు మూడు రోజుల తిన్న తర్వాత కొంతమందికి జలుబు దగ్గు వచ్చేవి. ఇవన్నీ మామూలే. పాపం రోడ్లు సరిగా లేని ఊరికి ఎలా వచ్చేవాడేమో ఆ సాయిబు. అందులో ఎండలో. కరిగిపోయిన కరిగిపోగా మిగిలిన వాటిని అమ్మితే వచ్చే లాభం ఎంతో తెలీదు. ఒక వేసవి కాలం మాత్రమే వచ్చేవాడు మా సాయిబు. 

ఆ సాయిబు గురించి అంతలా గొప్పగా చెప్తున్నారు ఏమిటి అని అందరికీ సందేహం కలగొచ్చు నిజమే కదా అండి సరిగా రహదారులు లేని ఊరికి మధ్యాహ్నం పూట మండుటెండలో రావడం నిజంగా కష్టమైన పనే కదా. ఏదో ఒక చెట్టు నీడన ఆగి వ్యాపారం చేసుకుందాం అంటే బేరాలు ఏవి ఉండవు. ప్రజల వద్దకు పాలన లాగా పిల్లల వద్దకు తినుబండారాలు అందుకే అలాంటి ఊర్లో. పైగా అవి ఎక్కువ సేపు నిలవ ఉండే పదార్థం కూడా కాదు. సూర్యుడిని చూస్తే దాని మనసు కరిగిపోతుంది. పోనీ ఎండ మండిపోతుంది ఒక ఐస్ ఫ్రూట్ చప్పరిద్దామని అనుకుంటే వచ్చే లాభం కరిగిపోతుందని పాపం తెచ్చుకున్న మంచినీళ్లు సీసా ఖాళీ చేసేవాడు తప్ప కక్కుర్తి పడేవాడు కాదు.

అలా సాయిబు ఐస్ చప్పరించిన తర్వాత ఆటలాడుకుంటూ కాలక్షేపం చేసే కుర్ర కారుకి దూరం నుంచి ఒక కావిడిలో రెండు తట్టలు పెట్టుకుని నల్లటి శరీరంతో తెల్లటి పంచ కట్టుకుని పైన ఏమీ లేకుండా తలకి తలపాగా చుట్టుకుని చేతికి వెండి కడియం తొడుక్కుని కాళ్లకు చెప్పులు వేసుకుని లావుగా ఉండి నడుచుకుంటే వచ్చే ఆ వ్యక్తి మా ఊరికి ఈనాటి చాట్ బండి లాంటివాడు. 

దూరం నుంచే ఆ తట్టలోని వస్తువుల వాసనలు ఇట్టే ఆకర్షించేవి పిల్లలందరినీ. ఇంతకీ ఆ వ్యక్తి పేరు తెలియదు కానీ ఓయి తాత అనే వాళ్ళం.

 కుడివైపు తట్టలో ఉల్లిపాయ వేసినా మసాలా గారెలు, పచ్చగా మెరిసిపోయే పెసర పునుకులు, మరొక తట్టలో జంతికలు పెట్టుకుని అగ్రహారంలో కి అడుగుపెడితే ఇంకేముంది తట్టలు ఖాళీ అయిపోయేవి. చేతిలో ఏదో మహత్యం ఉంది. ఏ పదార్థం తీసుకున్న అద్భుతమైన రుచి. ఎన్నోసార్లు పెసర పునుగులు తింటుంటాం కానీ అంత అద్భుతమైన రుచి గలవి మళ్లీ ఎక్కడ తినలేదు. మనవాళ్లు పప్పులు తేడా అంటూ ఏవేవో సాకులు చెప్తున్నారు కానీ ఏదో మహత్యం ఉంది. గుండ్రంగా పసుపుపచ్చగా మెరిసిపోతూ కొరకగానే మృదువుగా ఉండి ఎక్కువసేపు నమలకుండానే లోపలకి పోయే ఆ పెసరపుణుకులని ఎలా మర్చిపోగలం. పెసర పునుగుల్లో నంజుకోవడానికి పేపర్ ముక్కలో పెట్టి ఎర్ర కారం ఏదో ఇచ్చేవాడు. కమ్మటి పెసర పునుకు కారం నంజుకుని తింటుంటే స్వర్గమే కనపడేది. 

 ఏ పదార్థానికి ఆ పదార్థమే అద్భుతమైన రుచి. ఇంకా మసాలా గారిలో మసాలా వేసేవాడు కాదు తెలియదు కానీ తక్కువ పిండితో ఉల్లిపాయలు ఎక్కువగా వేసి గుండ్రంగా పొద్దు వాలిపోతున్న సూర్యుడు రంగులో కొరికితే కమ్మగా తియ్యగా బెల్లం వెయ్యరండి ఉడికిన ఉల్లిపాయ రుచి . 
మళ్లీ మళ్లీ తినాలనే కోరికతో మసాలా గారి వైపు మనసు లాగేసేది. అప్పుడు రేటు గురించి తెలియదు. ఏం నూనె వాడతారో తెలీదు. ఇప్పుడు అయితే ఏ నూనె వాడుతున్నారని మరిమరి గుచ్చి గుచ్చి అడుగుతాం. రిఫైన్డ్ ఆయిల్ తప్పితే ఏవి వాడo అండి అంటూ సమాధానం చెప్పేస్తాడు. అప్పట్లో అలా అడిగే వారు లేరు. ఇతని దగ్గర సరుకు బాగుంటుందనే నమ్మకం తోటి వ్యాపారం సాగి పోయేది.  

దీపావళికి కాల్చుకునే విష్ణు చక్రాలు భూచక్రాలు లా ఉండేవి గంపలోని జంతికలు. ఈ విష్ణు చక్రం భూ చక్రం అగ్గిపుల్లతో వెలిగించగానే గిర్రున తిరుగుతూ వెలుగులు పంచేవి. ఈ జంతికలు నోట్లో పెట్టుకోగానే నములుతుంటే కరకర శబ్దం వచ్చి మనసు ఆనందపడి కళ్ళల్లో వెలుగు వచ్చేది. ఒకటి ఆకలి తీరిందని రెండవది మనసుకు నచ్చినది తిన్నామని ఆనందానికి కారణం. అరువు రేపు అరే బోర్డు పెట్టుకునే వాడు కాదు. డైరీలోని రాసుకునేవాడు కాదు. ఏ ఇంటి దగ్గర ఆగితే ఆ ఇంటి తాలూకు గత రోజు బాకీ టక్కున చెప్పేసి వాడు. అలా ఉండేది ఓయి తాత బ్రెయిన్. 

మధ్యాహ్నం పూట సాయిబు మూడు గంటలకి ఓయ్ తాత వెళ్లిపోయిన తర్వాత పొలంలోని తాటి ముంజులు కావు తీసిన మామిడి పండ్లు చెట్ల మీద మామిడికాయలు ఇంట్లో వేసిన అట్లు, రైతులు ఇచ్చిన జున్ను, అమ్మ చేసిన పాకుండలు ఇలా ఆ సైన్యం ఆకలి తీర్చేవి. ఆ పల్లెటూర్లో. ఇవన్నీ వేసవికాలం మధురానుభూతులు.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట