తలరాత
తలరాత
ఉదయం నుంచి వర్షం భారీగా కురుస్తోంది. జనజీవనం అంతా
అస్తవ్యస్తo అయిపోయింది. రోడ్డుమీద ఒకరు కూడా
తిరగటం లేదు. ఉన్నట్టుండి వీధి గుమ్మo లోనుంచి అమ్మా
ఇంత అన్నం ఉంటే పెట్టండి చలిగా ఉంది ఒక పాత బట్ట
ఇవ్వండి అంటూ దీనంగా ఒక వృద్ధురాలి అరుపువినిపించింది.
ఇంత వర్షంలో ఎవరు అబ్బా అనుకుంటూ సీతమ్మ గారు వీధి
గుమ్మంలోకి తొంగి చూసారు. ఒక చేతిలో కర్ర మరొక
చేతిలోగిన్నె పట్టుకుని చిరిగిపోయిన బట్టలతో ఒక వృద్ధురాలు
వణికిపోతూ గుమ్మంలో నిలబడి ఉంది. ఈవిడ ఎవరో
ఎరుగున్న మనిషి లాగే ఉంది. ఎక్కడో చూసినట్టుగా ఉంది అని
మనసులో అనుకుంటూసీతమ్మ గారు అమ్మ మీరు వెనక వేపుకు పాకలోకి రండి. బట్టలు మార్చుకుని అన్నం తిందురు గాని వర్షం లో ఎలా తింటారు. పైగా బాగా తడిసిపోయి ఉన్నారు అంటూ పెట్టలోంచి పాత చీర జాకెట్లు తీసి ఆ
వృద్ధురాలికి ఇచ్చింది. ఆ వృద్ధురాలు బట్టలు మార్చుకునేలాగా
గిన్నెలో వేడి వేడి అన్నం పప్పు కూర మజ్జిగ తో భోజనం
అరిటాకు వేసి వడ్డించింది. పాపం ఎన్ని రోజులైందో ఆ ముసలిది
అన్నం తిని ఆకులో అన్నం అంతా ఖాళీ చేసేసి అమ్మా ప్రాణం
నిలబెట్టారు అంటూ రెండు చేతులెత్తి సీతమ్మ గారికి
నమస్కారం చేసింది.
సీతమ్మ గారు మానవసేవ మాధవ సేవ అని నమ్మే వ్యక్తి.
పదిమంది ఉన్న కుటుంబాన్ని నుంచి వచ్చిన వ్యక్తి. అన్ని కష్ట
సుఖాలను అనుభవించి ఇతరుల కష్ట సుఖాలు కూడా అర్థం
చేసుకోగల వ్యక్తి. భర్త కూడా అందుకు చేదోడు వాదోడుగా
ఉంటాడు. అందుకే ఎవరు ఏ వేళ వచ్చిన పట్టెడు అన్నం పెట్టి
ఆకలి తీర్చే వ్యక్తి. సీతమ్మ గారు కూడ ప్రతి నమస్కారం చేసి అమ్మ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. కానీ నీ పేరు
గుర్తుకు రావటం లేదంటూ అనుమానం వ్యక్తం చేసింది.
అమ్మా నా పేరు భ్రమరాంబ. నన్ను మీరు మర్చిపోయారు.
కానీ నాకు మీరు గుర్తున్నారు. ఆ పేరు వినగానే ఆ ఊరిలో ఆ
పేరు గల వ్యక్తి ఒకే ఒక వ్యక్తి. సీతమ్మ గారికి కాళ్ళ కింద భూమి
ఒకసారి కదిలినట్లుగా అయ్యింది. ఎలా ఉండే వ్యక్తి ఎలా అయిపోయింది. పచ్చగా మెరిసిపోయే శరీరం పెద్ద వాలు జడ ఒంటినిండా బంగారం తో చేతులకు ఎప్పుడు గోరింటాకుతో అచ్చు లక్ష్మీదేవిలా ఉండే ఆ రూపం ఒక్కసారిగా సీతమ్మ గారి కళ్ళ ముందు కనబడింది . తరచుగా సీతమ్మ గారి భర్త గారి దగ్గరికి ఆయుర్వేదం మందు కోసం గూడు బండిలో సీతమ్మ గారి ఇంటికి వచ్చేది. ఆ రోజుల్లో వైద్యం చేయించుకుని వెళ్లిపోయేది గాని ఎవరితో ఎక్కువగా మాట్లాడేది కాదు.మరి ఇప్పుడు ఇలా అంటూ ప్రశ్నార్థకంగా చూసిన సీతమ్మగారికి కళ్ళు తుడుచుకుంటూ తన కథ చెప్పడం ప్రారంభించింది.
నా భర్త కి ఒక తమ్ముడు ఒక చెల్లి . మాది ఉమ్మడి కుటుంబం అందరం కలిసి మెలిసి ఉండేవాళ్ళo. మా మరిదికి ఆడపడుచుకి పెళ్లి చేసాం. మా అత్తగారు మామగారు కాలం చేశారు. మాకు 20 ఎకరాలు భూమి లంకoత ఇల్లు చేతిలో నలుగురు నౌకర్లు మేము ఎవరు కాలు కింద పెట్టక్కర్లేదు. అన్ని నౌకర్లే చేసుకుంటూ పోయేవారు. నాకు చిన్నప్పటినుంచి దైవభక్తి ఎక్కువ. ఎక్కువగా పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఉండేదాన్ని. ఇంటి విషయాలు పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు.
మా మరిది తోటి కోడలు వాళ్లే అన్ని బాధ్యతలు చూసేవాళ్ళు. మా ఆయన ఎప్పుడూ పొలం పనుల్లోనే ఉండేవాడు. ఎప్పుడో రాత్రి ఇంటికి వచ్చేవాడు. మళ్లీ తెల్లవారగానే వెళ్ళిపోయే వాడు. మా ఆయనకి నేను ఇంట్లో భార్య ఉందని జ్ఞాపకం ఉండేది కాదు. పెళ్లయి నాలుగు సంవత్సరాలయింది మాకు పిల్లలు పుట్టలేదు. పైగా ఆయనికి కొంచెం తాగుడు వ్యసనం ఉండేది . లూ చేతిలో కావలసినంత డబ్బు అడిగే నాధుడు లేక చాలా ఇష్టానుసారంగా ప్రవర్తించేవాడు నా భర్త. నేనెప్పుడూ నా భర్తను ఆపాలని ప్రయత్నం చేయలేదు. పనివాళ్ళు మాత్రం పరోక్షంగా నన్ను హెచ్చరిస్తూనే ఉండేవారు. మీరు అమాయకులు మిగిలిన వాళ్ళందరూ తెలివి అయినా వాళ్ళు అంటూ. ఆ విషయం నేను పెద్దగా పట్టించుకునే దాన్ని కాదు.
మా మరిదికి ఇద్దరు పిల్లలు. కుటుంబ వ్యవహారాలన్నీ మా మరిది భార్య చూసుకునేవారు. అక్క అంటూ ఎంతో ప్రేమగా పిలిచి అన్నింటికీ తోటికోడలు నన్ను సంప్రదించేది. కానీ నేను దేంట్లోను తల దూర్చే దానిని కాదు.
రోజు మాతోటి కోడలు కూడా పొలం వెళుతూ ఉండేది. వెళ్ళినప్పుడల్లా క్యారేజ్ పట్టుకొని మా ఆయనకి మా మరిదికి దగ్గరుండి వడ్డించి తినిపించేది. ఇలా ఉండేది మా సంసారం.
కాలం ఎప్పుడూ మనుషుల్ని ఒకలా ఉంచదు. పరిస్థితులను బట్టి ప్రవర్తనలో మార్పులు వస్తూ ఉంటాయి. ఎప్పటికీ మనిషిని మంచివాడనే ముద్ర వేసి ఉన్నత స్థానంలో ఉంచడానికి వీల్లేదు.
మనిషి అన్న వాడు మారుతూనే ఉంటాడు.
మనిషన్నవాడు చుట్టూ ఉండే పరిస్థితులను ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. మాటలనులోతుగాపరిశీలించుకుంటూ ఉండాలి. ప్రవర్తన అంచనా వేస్తూ ఉండాలి. అనుమానించడం కాదు. లేదంటే ఈ కాలంలో దగ్గర వాళ్ళే ఇంటికి కన్నం వేస్తారు.
దీనికి అంతటికి కారణం ప్రపంచమంతా డబ్బు అనే మహమ్మారి చుట్టూ తిరుగుతోంది. ఎప్పుడు ఎవరికీ ఆశపుడుతుందో. తెల్లవారు లేస్తే రోజు జరిగే హత్యలన్నీ డబ్బేగా ప్రధాన కేంద్రం.
ఎలాగైనా దాన్ని చేజిక్కించుకోవాలని ఆరాటపడి పడరాన్ని పాట్లు పడుతోంది ప్రపంచం. అవసరమైతే అన్నిటికన్నా విలువైన మానాన్ని తాకట్టు పెడుతోంది. ఇది ప్రపంచపు పోకడ.
మన సంఘంలో నివసిస్తూ మన చుట్టూ ఉండే వాళ్ళని జరుగుతున్న పరిస్థితుల్ని జాగ్రత్తగా గమనించ కోక పోతే
అయినవాళ్లే గోతులు తీస్తారు.
ఒకసారి మా మరిది ఎరువులు కొనడానికి పక్క ఊరికి వెళ్ళాడు.
రెండు రోజులుకు కానీ రాడు. ఎప్పటిలాగా మా మరిది భార్య క్యారేజీ పట్టుకుని పొలం వెళ్ళింది. ఇంతలో మా మరిది పిల్లలు స్కూల్ నుండి తిరిగి వచ్చి అమ్మ కావాలనీ ఏడుపు మొదలుపెట్టారు. నేను పిల్లలను సముదాయించిన వాళ్ళు ఏడుపు మానలేదు. చేసేదిలేక పిల్లలు తీసుకుని పొలం దగ్గర ఉన్న గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళాను. గెస్ట్ హౌస్ లోపల నుండి నవ్వులు మాటలు వినిపించాయి. ఆ గొంతులు ఎవరో గుర్తుపట్టాను.అక్కడ చేతిలో కర్రతో నిలబడి ఉన్న మా పాలేరు ముసి ముసి నవ్వులు నవ్వుతూ కనిపించాడు. పిల్లల్ని వాడికి అప్పచెప్పి నేను గబగబా ఇంటికి వచ్చి మంచం మీద పడుకుని బోరున ఏడుస్తూ నిద్రలోకి జారిపోయాను.
నేను తెల్లవారు లేచేటప్పటికీ నా భర్త పొలం వెళ్ళిపోయాడు. మా మరిది మా తోటి కోడలు గదిలో ఏదో మాట్లాడుకుంటున్నారు
నేను ఎవరికీ చెప్పకుండా పొలo వెళ్లేసరికి నా భర్త వాలు కుర్చీలో కూర్చుని సిగరెట్ తాగుతూ ఉన్నాడు. కళ్ళు ఎర్ర చింత
నిప్పులా ఉన్నాయి.
మీరు చేస్తుంది ఏమి బాగాలేదు అంటూ గట్టిగా గద్దించి ప్రశ్నించాను. నా ఇష్టం అంటూ కోపంతో గట్టిగా అరిచాడు. మా ఇద్దరి మధ్య చాలా సేపు వాదోపవాదాలు జరిగాయి.
నేను కోపం పట్టలేక పాలేరు చేతిలో ఉన్న కర్ర తీసుకుని నా భర్త తల మీద గట్టిగా కొట్టాను.
అతను తలపట్టుకుని అమ్మా అంటూ కుర్చీలోంచి కిందకుపడిపోయాడు.ఆ అనూహ్యపరిణామానికి నేను స్పృహ తప్పి పడిపోయాను.
నేను కళ్ళు తెరిచి చూసేటప్పటికి నా చుట్టూ పోలీసులు మా మా మరిది భార్య పిల్లలు ఇంకా ఊరి జనం గుమి గూడి ఉన్నారు. ఆస్తి కోసంభర్తని హత్య చేసిందంటు ఎవరో దూరంగా అనుకుంటున్న మాటలు నా చెవిని పడ్డాయి. హత్య నేరం క్రింద పోలీసుల అరెస్ట్ చేస్తే కోర్టు జైలు శిక్ష విధించింది. నేను జైలులో ఉన్నంతకాలం ఎవరు నన్ను చూడడానికి కూడా రాలేదు. నేను జైలు శిక్ష పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేటప్పటికి మరో బాంబులాంటి విషయం తెలిసింది. నా భర్త తన వాటా ఆస్తి ఎప్పుడో మా తోటి కోడలి పేరున మార్చేశాడు అని ఆ ఊరి కరణo గారు చెప్పారు. మా తోటి కోడలు మరిది నా సామాన్లు అంతా బయటికి విసిరేసి తలుపులు వేసేసుకున్నరు. చేసేదిలేక గుడిమెట్ల మీద కాలక్షేపం చేస్తున్నాను. తర్వాత ఇంకొక భయంకర నిజం బయటపడింది. మా మరిది సంసారానికి పనికి రాడని అందుకనే మా తోటి కోడలు అంటూ ఏడుస్తూ తన కథంతా చెప్పసాగారు భ్రమరాంబగారు. ఈలోగా వర్షం కాస్త తగ్గింది. భ్రమరాంబ గారు బయలుదేరారు.
జీవితం ఎవరిని ఎప్పుడు ఎలా తిప్పుతుందో ఎవరికి తెలియదు. కొంతమంది ఉన్నట్టుండి కోటీశ్వరులు అయిపోతారు. కొన్ని జీవితాలు ఉన్నట్టుండి రోడ్డుకి ఎక్కుతాయి. ఈరోజు మంచిగా గడిచింది అనుకుంటే చాలు. రేపు జరగబోయేది ఎవరికీ తెలియదు. అలా సీతమ్మ గారు ఆలోచనలో పడిపోయారు. ఏదో సహాయం భ్రమరాంబ గారికి తప్పకుండా చెయ్యాలి అని దృఢ సంకల్పం చేసుకొని ఆ రాత్రి భర్తతో సంప్రదించి భ్రమరాంబ గారిని ప్రక్క టౌన్ లో ఉన్న ఉచిత అనాధ శరణాలయంలో చేర్పించి తృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి