ఆఖరి మాట
ఆఖరి మాట
ప్రపంచంలో ఏ ప్రాణికోటికి లేని అత్యంత అమూల్యమైన వరం మానవ జన్మకి దేవుడిచ్చాడు. తన మనసులోని భావాన్ని ఇతరులకు తెలియజేయడానికి అవకాశం కల్పించాడు. దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా పంచుకోవడానికి మాట అనే ఆయుధాన్ని ఇచ్చాడు.
మానవ శరీరంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన నోరు అనే అవయవం ద్వారా వచ్చే మాటకి అత్యంత ప్రాముఖ్యత ఉంది. మాట ఇద్దరు మనుషుల మనసులను కలుపుతుంది. అలాగే బంధాలను విడదీస్తుంది. రోజు ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం. అన్నిటికీ వెనుక బలమైన ఆధారం ఉంటే అది నిజం అంటారు. కాకపోతే అబద్ధమే కదా మరి. మనిషి శాశ్వతం కాదు కానీ మాట మటుకు ఎప్పటికీ గుర్తుంటుంది. రోజు అనేక మందితో అనేక మాటలు మాట్లాడుతుంటాము. అది ఆ వ్యక్తితో అదే ఆఖరి మాటని మనకు తెలీదు. ఆఖరి మాట అనేది ఎప్పుడవుతుంది. ఆ వ్యక్తి ఈ లోకo నుండి శాశ్వతంగా వెళ్ళిపోయినప్పుడు వారితో ఆఖరిసారిగా మాట్లాడినదే ఆఖరి మాటవుతుంది. కానీ మనకు అది తెలియదు. చుట్టూ ఎంతో మంది వ్యక్తులు ఉంటారు. కానీ ఒక వ్యక్తి తోటే తన మనసులోని భావాన్ని పంచుకోవడం ఆ సమయంలో ఆ వ్యక్తి మీద ప్రత్యేక అభిమానమే అని చెప్పొచ్చు.
అప్పుడే ఏడు సంవత్సరాలు పూర్తయింది. కానీ ఆ వ్యక్తి ఆఖరి సారిగా మాట్లాడిన మాట ఇప్పటికీ చెవుల్లో గింగురు మంటూనే ఉంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు . అదే మా అక్క కాకరాల సత్య గౌరి ఆఖరి సారిగా నాతో మాట్లాడిన మాటలు. అందరూ ఆడపిల్లల్లాగా పెళ్లయిన తర్వాత జీవితం సక్రమంగా ఉండి ఉంటే అంత అనుబంధం మా తోటి ఉండేది కాదని అనిపిస్తుంది. ఎప్పుడో చుట్టూ చూపుగా రావడం తప్పితే పెళ్లయిన ఆడపిల్లలు ఎక్కువగా భర్త దగ్గరే ఉంటారుగా.
నేను పుట్టేటప్పటికి విధి వక్రించి పుట్టింటికి చేరిన మా అక్క తోటి అనుబంధం అమ్మ కంటే ఎక్కువ. ఒకరు నవ మాసాలు కనిపించిన తల్లి అయితే మరొకరు ప్రేమ ఆప్యాయత అభిమానంతో పెంచి పెద్ద చేసిన పెంపుడు తల్లి. బాలకృష్ణుడు లాగా. నేను భూమ్మీద కళ్ళు తెరిచేటప్పటికీ అక్క మా ఇంటికి చేరడంతో అక్క తోటి అనుబంధం చాలా ఎక్కువ. కష్టం సుఖం బాధ సంతోషం అన్నీ పంచుకునే ఓ పెద్ద దిక్కు. మంచి చెడ్డ సన్మార్గం చూపే ఓ దేవత. ఆమెకి ఏమి అవసరం. నా కుటుంబం అనే భావనతో కడుపున పుట్టిన పిల్లలు లేకపోయినా తమ్ముళ్లు చెల్లెళ్లని సొంత పిల్లలుగా చూసుకుంటూ బాధ్యతలన్నీ నెత్తి మీద వేసుకుని ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ భగవంతుడు చూపిన ఒక చిన్న బ్రతుకు దారితో చక్కని ఆర్థిక ప్రణాళికతో కుటుంబం పదిమందిలో నవ్వుల పాలు కాకుండా అందరూ మెచ్చే విధంగా కుటుంబ గౌరవాన్ని కాపాడిన ఆమె జీవితం నిజంగా పదిమందికి ఆదర్శం.
నాన్న పోయిన తర్వాత మిగిలిపోయిన బాధ్యతలకు పూర్తిగా బందీ అయిపోయింది. ఏదో డబ్బు ఖర్చు పెట్టడం కాదు మిగిలిన పిల్లలకి మానసికంగా ఎంతో బలమిస్తూ నేనున్నానని భుజం తడుతూ ధైర్యం చెబుతూ కుటుంబాన్ని ఒక త్రాటిపై నడిపిస్తూ ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడుపుతూ తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ ఎన్నో ప్రణాళికలు వేసి అవసరమైనచోట కొంతమందిని ధైర్యంగా ఎదుర్కొంటూ నాన్న మిగిల్చిన బాధ్యతలను అందలం ఎక్కించి ఎప్పుడూ కుటుంబం గురించి సంతోషపడుతూ పదిమందితో తన పరివారం గురించి చెప్పుకుంటూ ఆనందంగా పదవీ విరమణ చేసి తనకుంటూ ఆర్థిక భద్రత కల్పించుకుని ఒక గూడు నిర్మించుకుని సాయి రాముడి సేవలో జీవితం గడిపిన ఆమె రుణం ఎలా తీర్చుకోగలం. నవ మాసాలు మోసి పురిటి నొప్పులు భరించి కనకపోయినా ఆమె మాతృ సమానురాలు. మాతృ రుణం ఎప్పటికీ తీరనిది తీర్చుకోలేనిది. జ్ఞప్తికి వచ్చినప్పుడల్లా కన్నీళ్లు కార్చడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు.
ఉదయం లేస్తూనే చ రవాణిలో ఒకసారి యోగక్షేమం తెలుసుకోకపోతే ఆరోజు తోచేది కాదు. విధి నిర్వహణలో విరామం దొరికినప్పుడు మధ్యలో ఒకసారి చరవాణిలో యోగక్షేమం తెలుసుకోవడం ఒక దిన చర్య. ఇంచుమించుగా ప్రతి ఆదివారం సాయంకాలం పూట అక్క ఇంటి దగ్గరికి వెళ్లడం మంచి చెడ్డ మాట్లాడుకోవడం ఇదొక అలవాటుగా మారిపోయింది.
ఆమె జవాబు దొరకని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేది. అనుసరించవలసిన మార్గం. ఆచరించవలసిన ధర్మం. నడవడికలో మార్పులు ఇవి ప్రతివారం నేర్చుకునే విషయాలు. ఆప్యాయంగా పెట్టిన అల్పాహారం ఒక కప్పు కాఫీ తోటి అంతకుమించి అనురాగపూరితమైన మాటలతో కడుపు నిండిపోయేది. ఆ వారం అంతా విధి నిర్వహణ లో పడ్డ మానసిక శ్రమకి ఒక పెద్ద రిలీఫ్ దొరికేది. మండుటెండలో దారిన పోయే బాటసారి కి రోడ్డు పక్కన కనబడ్డ ఒక పెద్ద చెట్టు ఎలాంటి చల్లదనాన్ని ఇస్తుందో అలా ఉండేది ఆమె సాన్నిధ్యం.
కాలం తీసుకొచ్చే మార్పులను ఎవరు ఊహించలేం. ఊహించనివి జరుగుతూ ఉంటాయి. ఒకరోజు రాత్రి శుభకార్యానికి పొరుగూరు వెళుతూ మధ్యలో నన్ను పలకరించి నా నోట్లో ఒక తియ్యటి కాజా పెట్టి శుభకార్యం పూర్తి చేసుకుని అర్ధరాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత కథ మలుపు తిరిగింది. విచిత్రం ఆమె చేత్తో ఆఖరిసారిగా పెట్టిన తిను బండారం నాకే. కొన్ని కాకతాళియంగా జరుగుతాయి. ఏదో అభిమానం
సరే అది అలా జరగాలని ఉంది జరిగింది. అయినప్పటికీ ఇంట్లో మిగిలిన ఒక్క తినుబండారం కూడా మర్చిపోకుండా తీసుకొచ్చి నాకు పెట్టడం అనేది ఎంతో అదృష్టంగా భావిస్తాను ఇప్పటికి. అది ఎప్పటికీ అమృతతుల్యమే. ఉదయమే చరవాణి సంభాషణలో గత రాత్రి బాధించిన నొప్పి గురించి చెబితే దానికి మామూలుగా ఎప్పుడూ బాధించే గ్యాస్ సమస్య అనుకున్నా. విధి నిర్వహణ మధ్యలో చేసిన చరవాణి సంభాషణలో ఆమె కంఠంలో కొంచెం బాధ ధ్వనించింది.
డాక్టర్ దగ్గరికి వెళ్ళమని సలహా అయితే ఇచ్చాను కానీ ఆ పని చేయలేకపోయాను. కాలం గడిచే కొద్దీ నొప్పి ఎక్కువై వైద్య సహాయం కోసం అపోలో ఆసుపత్రి చేరడం వైద్య సహాయం లో భాగంగా చేయవలసిన పరీక్ష కోసం స్ట్రెచెర్ మీద పడుకోబెట్టి నాలుగో అంతస్తులో ఉన్న ఆ గదికి తీసుకు వెళ్ళడానికి లిఫ్ట్ ఎక్కించే ముందు చుట్టూ అందరూ ఆత్మీయులే నాకేసి చూసి" భయపడకు వచ్చేస్తాను" అంటూ నాకు ధైర్యం చెప్పిన ఆఖరి మాట ఇదే. ఆ తర్వాత గాల్లోకి లేచిన లిఫ్ట్ తో పాటు ఆమె ప్రాణం కూడా గాల్లో కలిసిపోయింది. అందరికీ వైద్యo దగ్గరుండి చేయించే ఆమెకి ఆసుపత్రి అంటే ఎక్కడలేని భయం. ఇప్పటికే నేను భయంతోటే పోయిందని అనుకుంటాను. ఆ ఆఖరి మాట ఇప్పటికీ నా చెవుల్లో గింగురమంటూనే ఉంటుంది. తలుచుకున్నప్పుడల్లా కన్నీళ్లు వరదలై ప్రవహిస్తాయి.
ఆమె జీవితం ఒక పెద్ద పుస్తకం. ప్రతి పేజీ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో. అందులో బాధలు కన్నీళ్లు జయాలు అపజయాలు అవమానాలు. అయినా గుండె ధైర్యం తెచ్చుకుని విధిని ఎదిరించి తనకు తానుగా ఎదిగి పదిమందికి ఆదర్శంగా నిలబడిన ఒక వీర వనిత.
ఆ ఆఖరి మాట నాకు ఓదార్పు మాట అయిన అది ఎంతో విలువైనదిగా భావిస్తాను. అది ఆఖరి మాట కాబట్టి. మనిషి మట్టిలో కలిసిపోయింది. చెప్పిన మాట గాలిలో కలిసిపోయిన నా హృదయంలో నాటుకుపోయింది. మనసులో నాటుకుపోయిన ఏ మాటైనా మర్చిపోలే ము.
అది మంచి మాటైనా చెడ్డ మాట అయినా అలా బలంగా గుండెల్లో ఉండిపోతుంది. రోజుకు లక్షల మాటలు వింటుంటాం. కానీ ఈ లోకంలో లేని ఆమె చెప్పిన ఆఖరి మాట ఎంతో విలువైంది.
ఈ ప్రపంచంలో ఎంతో మంది పుడుతుంటారు చచ్చిపోతుంటారు. కానీ కొంతమంది మాత్రమే తలుచుకున్నప్పుడల్లా మన గుండె తడి చేస్తారు.
అందుకే వాళ్ళు మహనీయులవుతారు.
రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి