శివరాత్రి
మానవ జీవితం క్షణిక మైనది. ఆ క్షణికమైన జీవితం కోసం నిత్యజీవితంలోఎన్నో పాపాలు చేస్తుంటాడు. పాపము అంటే మనిషిని కత్తితోచంపడం ఒక్కటే కాదు. మానసికంగా భాధించినా అది కూడా పాపమే అవుతుంది.
రోడ్డు మీద నడుస్తూ ఉంటాం. కంటికి కనబడని ఎన్నో లక్షల జీవరాశుల కాళ్ళ కింద పడి నలిగి పోతూ ఉంటాయి.
అది కూడా పాపమే. తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే. తప్పులు చేయడం మానవ సహజం. తప్పులు సరిదిద్దుకోవడం మనిషి లక్షణం. మానవుడు చేసిన తప్పులు అన్నిటికీ భగవంతుడే మార్గం చూపించాడు. భగవంతుని ఆరాధన ఒక్కటే శరణ్యం. ఆ ఆరాధన చేయడానికి కి మంచి రోజులు కూడా దేవుడే చూపించాడు. భారతీయ పండుగలు అన్నీ అలా పుట్టినవే.
చాంద్రమానం ప్రకారం చైత్రమాసం మొదలుకొని ఫాల్గుణ మాసం వరకు ప్రతి నెలలో ఏదో ఒక పండుగ వస్తూనే ఉంటుంది. మాఘ మాసంలో వచ్చే అతి ముఖ్యమైన పండుగ శివరాత్రి. ఆరుద్ర నక్షత్రం తో కలిపి వచ్చే మాఘ బహుళ చతుర్దశి శివరాత్రి అంటారు. ఈ రోజున శివుడు లింగాకారంలో ఉద్భవించాడని శివపార్వతుల కల్యాణం జరిగిందని శివపురాణం చెబుతోంది
.
శివుడు త్రిమూర్తులలో ఒకరు. ఆది అంతం లేని వాడు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఏ కాలం నుంచి ఏ కాలానికైనా అవలీలగా పయనించేవాడు . కల్మషం లేని వాడు. కాలమునకు వశము కాని వాడు . లయకారుడు.
పరమేశ్వరుడికి తల్లిదండ్రులు లేరు. ఏ దేవుడు స్మశానంలో ఉండరు . శివుడు ఒక్కడే స్మశానంలో ఉంటాడు. బంధువులందరూ వదిలి వెళ్ళిపోయిన నేను నీకు తోడు అని పార్ధివ శరీరాలకు భరోసా కల్పిస్తాడు. ఆది అంతం లేని వాడు. శివుడు లింగరూపంలో పశుపతి రూపంలో దర్శనమిస్తాడు.. శివుడు అనగా అంతటా ఉండే వాడు. అందుకే పరమశివుడు అయ్యాడు. గరళాన్ని కంఠంలో దాచుకుని నీలకంఠుడు అయ్యాడు.
శివుడు త్రిశూలం ధరిస్తాడు. అది సత్వ రజ తమో గుణాలకు ప్రతి రూపం. తల పైన నెలవంక ఉంటుంది.
అది మనోనిగ్రహానికి ప్రతి రూపం. గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక. డమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం.
సర్పాలు భగవంతుని జీవాత్మ గాను, పులి చర్మం కోరికలు విడవమని అహంకారం వదులుకోవాలని, భస్మం పరిశుద్ధతను సూచిస్తాయి. మూడోకన్ను చైతన్యానికి ప్రతీక.
శివపంచాక్షరీ నామం మృత్యుంజయ మంత్రం మారేడు దళాలు తో అర్చన నమక చమక సహిత రుద్రాభిషేకం జాగరణలతో శివరాత్రి నాడుశివార్చన చేస్తారు. ఈ శివరాత్రి మహత్యం గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది.
ఒక వేటగాడు అడవిలో జంతువులను చంపి మాంసం తింటూ జీవితం గడుపుతుంటాడు. ఒక రోజు ఎంత వెతికినా వేటకి ఏమీ దొరకలేదు, విచారంతో ఒక నది దగ్గర ఉన్న చెట్టు ఎక్కి కూర్చుంటాడు. నది దగ్గరికి నాలుగు జింకలు ఒకదాని తర్వాత ఒకటి నీళ్లు తాగడానికి వస్తాయి.
ఆ జింకలు చెప్పిన కారణాలతో వాటిని చంప లేకపోతా డు. కానీ జింకలు తమ పని పూర్తయిన వెంటనే వచ్చి వేటగాడుకి లొంగిపోతాము అని చెబుతాయి.తెల్లవారులు ఆ చెట్టు మీద ఉంటాడు.కానీ వేటగాడికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆ నాలుగు జింకలు వచ్చి వేటగాడిని వధించమని కోరుతాయి. వేటగాడు వాటి నిజాయితీ కి మెచ్చి వాటిని చంపకుండా ఇంటికి వెళ్ళి పోతాడు. కానీ అది మారేడు దళాలు చెట్టు అని క్రింద శివుడు లింగ రూపంలో ఉన్నాడని తను తెల్లవార్లు మెలకువగా ఉండి జాగరణ చేశాడని మారేడు దళాలు శివుడి మీద పడ్డాయని ఆరోజు శివరాత్రి అని వేటగాడికి తెలియదు.ఆ వేటగాడు శివరాత్రి జాగరణ చేసి శివసాయుజ్యం బొందాడు.
మనదేశంలో ఉన్న దేవాలాయల్లో శివుడు లింగరూపం లోనే ఆరాధింపబడుతున్నాడు. కానీ ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని సూరుటుపల్లిలో శివుడు విగ్రహ రూపంలో ఉంటాడు. మనదేశంలో పంచ కేదారాలు పంచారామాలు శైవ క్షేత్రాలుగా పేరుపొందాయి. పంచ కేదారాలు అనగా కేదార్నాథ్ ,తుంగనాథ్ ,రుద్రనాథ్, మధ్య మహేశ్వర్,కల్పేశ్వర్. ఆంధ్రప్రదేశ్లోని ద్రాక్షారామం అమరావతి గునుపూడి భీమవరం సామర్లకోట పాలకొల్లు ఈ క్షేత్రాలు పంచారామాలు అంటారు. అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలలో కూడా అద్భుతమైన పుణ్య క్షేత్రాలుగా ప్రసిద్ధి కెక్కాయి. శివరాత్రి ఉత్సవాలు మహా అద్భుతంగా జరుగుతాయి. ఈ క్షేత్ర సందర్శన చేసి మనం కూడా ముక్తి పొందుదాము.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
కాకినాడ
9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి