గురువు

గురువు 

ప్రతి మనిషి అమ్మ ఒడిదాటి ఒక వయసు వచ్చిన తర్వాత అడుగుపెట్టేది బతుకు పాఠాలు నేర్పే గుడిలో. అదే మన బడి.
చిన్నతనo లో బడికి వెళ్లాలంటే ఒక రకమైన భయం. మనం బడికి వెళ్లకపోతే అమ్మకి భయం. అందుకే బలవంతంగా ఏడుస్తున్నా సరే బరబరా లాక్కుని వెళ్లి బడిలో కూర్చోబెడుతుంది. ఇది ప్రతి ఇంట్లో ప్రతి పిల్లవాడు బాల్యంలో జరిగే అనుభవమే. విద్య విలువ అమ్మకు తెలుస్తుంది. అజ్ఞానంలో ఉన్న బిడ్డలకు తెలియదు. బడి అంటే బ్రతుకు పాఠాలు నేర్పే బొమ్మ. ఓం ప్రధమంగా పలక మీద బలపం తో
అక్షరమాల నేర్పించి ఒక్కొక్క తరగతి గది దాటించి బ్రతుకుకి పునాది వేసేవాడు గురువు. గురువు అంటే బాధ్యత గల వ్యక్తి. గురు శిష్యులు అనుబంధం ఎవరు నిర్వచించలేం. ఒక తరగతి లో 30 మంది విద్యార్థులు ఉన్న అందరికి సమాన దృష్టితో విద్య బోధించేవాడు గురువు.

  ఆ బడిలో చేరిన పిల్లలందరూ తరగతి గదిలో బెంచీల మీద ఒకరి పక్కన ఒకరిని కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తారు. ఆ రకంగా పిల్లల మధ్య స్నేహ తత్వం పెంచుతారు గురువుగారు. పిల్లల మధ్య అలా మొదలైన స్నేహం కడవరకు సాగుతూ ఉంటుంది.
పాఠశాలంటే అన్ని విద్యలు నేర్పే సరస్వతీ మాత గుడి. పద్యాలను రాగయుక్తంగా చదివే తెలుగు మాస్టారు తెలుగు భాష పట్ల అభిమానం పెరిగేలా కృషి చేస్తారు. ఆ భాష విలువ అప్పుడు తెలియదు. 
బ్రతుకు పోరులో ఊరి ఎల్లలు దాటి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్న హిందీ ఇంగ్లీష్ భాషల ఉపయోగం ఎంతో ఉంది. ఆ భాషలు నేర్పిన గురువులకు ఎంతో రుణపడి ఉంటాం. ఎందుకంటే పరభాషలోనే మన బ్రతుకు పోరంతా సాగుతోంది. ఉద్యోగ నిర్వహణలో పై అధికారితో మాట్లాడాలన్నా ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలన్న హిందీ ఇంగ్లీష్ భాషలే ఉపయోగిస్తున్నాం. ఈ భాషలను నేర్పినది బాల్యంలోని ఉపాధ్యాయులే. గణితం అంటే ప్రతి విద్యార్థికి భయం. ఆ భయం పోగొట్టి సులువుగా గణిత బోధన చేసి  
గణిత మేధావి రామానుజన్ లాంటి విద్యార్థులను తయారుచేసిన ఉపాధ్యాయులు ఈ దేశంలో ఎందరో ఉన్నారు.

అజ్ఞానంగా ఉన్న విద్యార్థులకు విజ్ఞాన శాస్త్రం బోధించి
దేశంలో ఎంతోమంది శాస్త్రవేత్తలను తయారుచేసిన ఘనత ఉపాధ్యాయులదే. చిన్నతనంలో బోధించిన చరిత్ర ఆర్థిక శాస్త్రం
ఈనాటి ప్రముఖ పోటీ పరీక్షలకు అదే ఆధారం. అలా చెప్పకుంటే పోతే ఉపాధ్యాయుడి పాత్ర ఒక విద్యార్థి జీవితంలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది. 

ఏకలవ్యుడు లాంటి శిష్యులు గురువుకి ఎంతో పేరు తెచ్చారు. శ్రీకృష్ణుడు పరమాత్ముడే అయినా గురుముఖంగానే విద్య నేర్చుకున్నాడు. త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయ స్వామి వారికి ఇరవై నాలుగు మంది గురువులు. చుట్టూ ఉండే ప్రకృతిని జంతువుల్ని క్రిమి కీటకాలనీ తన గురువుగా ఎంచుకున్నాడు దత్తాత్రేయ స్వామి వారు.
ఎవరు ఎంత కీడు తలుపెట్టిన ఓర్పుతో తన బాధ్యతను విస్మరించనది భూమాత . అటువంటి భూమాత నుండి సహనాన్ని నేర్చుకున్నాను అంటారు స్వామివారు. 

సమస్త ప్రాణికోటికి జీవనాధారమైన వాయువులో ఎన్ని చెడువాసనలు వచ్చి చేరినప్పటికీ వేటిని తనలో నిలిపోకుండా స్వచ్ఛంగా ఉంటుంది. అంటే మనసు నిర్మలంగా ఉంచుకోవడం గాలి నుండి నేర్చుకున్నాను అంటారు స్వామి. 

ఆకాశం అనంతంగా వ్యాపించి ఉన్న దేనిని సొంతం చేసుకోకపోవడం దాని ముఖ్య లక్షణం. అలాగే జలానికి ఇహపర బేధాలు లేవు. స్వచ్ఛత అనేది నీరు యొక్క ముఖ్య లక్షణం. అలాగే సూర్యుడు చంద్రుడు పావురాయి కొండచిలువ ఏనుగు దగ్గర ఎన్నో మంచి విషయాలను నేర్చుకుని గురువులుగా చేసుకున్నాడు దత్తాత్రేయులవారు.

విద్యార్థుల్లోని అజ్ఞానం తొలగించి విజ్ఞానం పెంచేది ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయ వృత్తి చేసి భారతదేశ అత్యున్నత రాష్ట్రపతి పదవిని అలంకరించిన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారు జన్మదినo నాడు మనం ఉపాధ్యాయ దినోత్సవం గా జరుపుకుంటున్నాము.

ఈ మహా మనిషి మన ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం లో వైస్ ఛాన్స్లర్ గా పనిచేయడం జరిగింది.అటువంటి మహనీయునికి నివాళులర్పిస్తూ నాకు విద్య నేర్పిన గురువులందరికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
          కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట