పశువులు

మన నగరాల్లో జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. దానికి తోడు వాహనాల సంఖ్య రోడ్లమీద వాహనాల సంచారం విపరీతంగా పెరిగిపోయింది. దానికి అనుగుణంగా మన రోడ్ల పరిస్థితి రోజు రోజుకి దిగజారి పోతుంది. పెరిగే జనసంచారం కనుగుణంగా, వాహనాల సంఖ్యకు అనుగుణంగా రోడ్లు వెడల్పు చేయడం ప్రభుత్వం వారికి తలనొప్పిగా తయారైంది దానికి తోడు బడ్జెట్లు కూడా అంతంత మాత్రం. అయితే పూర్వ కాలంలో ఏడాదికో రెండేళ్ళకో సారి రోడ్ల పరిస్థితి పై ప్రభుత్వం వారు సమీక్ష చేసేవారు. ఇప్పుడు ప్రతి రోజు ట్రాఫిక్ సమస్య పై, రోడ్ల పరిస్థితి పై సమీక్ష చేయవలసిన అవసరం ఏర్పడు తోంది. దానికితోడు రోడ్లపై పశువుల సంచారం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇవి రోడ్డు మీద యధేచ్చగా తిరుగుతూ వాహనాలకి అడ్డుగా వచ్చి అనేక యాక్సిడెంట్ లకి కారణం అవుతున్నాయి.
పశువు అనగా పాశం చేత కట్టబడింది అనగా త్రాడు చేత
 కట్టబడింది. మనదేశంలో పశుపోషణ కూడా అతి ముఖ్యమైన వృత్తి. గ్రామాల్లో ఈ పశువులకి ఒక కాపలాదారు ఉంటారు. యథేచ్ఛగా రోడ్లమీదకు వదలరు.

 అయితే ఇటీవల కాలంలో నగరాలలో కూడా వృత్తిరీత్యా అయితే నేమి సరదా కోసం అయితే నేమి పశుపోషణ జరుగుతోంది. గోవు యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకొని నగరాల్లో పెంచడం ప్రారంభించారు. నూటికి 90 మంది పశువులకు కాపలాదారు ని పెట్టడం లేదు. ఉదయం పాలు పిండుకుని పశువుల్ని రోడ్ల మీదకి యధేచ్ఛగా వదిలేస్తున్నారు. అయితే అది రోడ్డు మీద దొరికే ప్లాస్టిక్ సంచీలు నుండి పాడైపోయిన ఆహారపదార్థాల వరకు తింటూ సాయంకాలానికి గూటికి చేరుతున్నాయి. వీటి మూలంగా వాటి ఆరోగ్యమే కాదు వాటినుండి తాగే పాలు కూడా మనకు అనారోగ్యాన్ని కలగ చేస్తున్నాయి. కొన్ని పశువులురాత్రుళ్లు కూడా ఇంటికి చేరడం లేదు రోడ్లమీదే వాటి మకాం. చీకట్లో స్పీడ్ గా వచ్చిన లారీల కి బస్సుల కి యాక్సిడెంట్లు కి కారణమవుతున్నాయి. మరో రకంగా యజమానికి పుణ్యం మాట ఎలా ఉన్నాపాపం కూడా. పాపం ఆ నోరు లేని మూగ జీవి కి ఏం తెలుసు అది పశువుల పాక లేక రహదారి అని. ఇక పందులు ,కుక్కలు గురించి చెప్పనవసరం లేదు. పందులు కారణంగా వాహనాలు తిరగబడి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన వార్తలు రోజు పేపర్లో వింటూనే ఉన్నాం. అనేక కొత్త రోగాలు ఈ జంతువుల మూలంగానే వస్తున్నాయి. అని శాస్త్రవేత్తలు రోజుకో కారణం చెబుతున్నారు. మున్సిపాలిటీ వారు ప్రతి వీధి కుక్క కి వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడితే బాగుంటుంది. పందుల పెంపకం దారులు కూడా ఈ విషయంలో బాగా శ్రద్ధ తీసుకోవాలి.

పూర్వకాలంలో ప్రతి గ్రామంలో బందేలదొడ్డి ఉండేది. విచ్చలవిడిగా తిరిగే పశువుల్ని పంచాయతీ వారు కానీ మునిసిపాలిటీ వారు కానీ ఇందులో బంధించి దాని యజమానికి తెలియపరచి ఫీజు వసూలు చేసి విడిచి పెట్టే వారు. ఇది ఒక రకంగా ప్రభుత్వానికి ఆదాయం కూడా. మరోరకంగా యజమానికి భయం ఉండేది. ఇప్పుడు నిర్వహణ వ్యయం భరించలేక ఏమో అవి కనుమరుగైపోయేయి.

 మనకు అత్యవసర వైద్య సహాయం కోసం అంబులెన్స్ ఉన్నాయి. యాక్సిడెంట్ అయిన పశువుల్ని తీసుకెళ్లాలి అంటే చాలా కష్టం. పశువుల ఆసుపత్రులు కూడా అంతంతమాత్రంగానే ఉంటాయి. దెబ్బతిన్న పశువు సహాయం అడగలేదు.తన బాధను చెప్పుకోలేదు.   

పోలీస్ శాఖ వారు పశువుల యజమానికి కౌన్సిలింగ్ ఇచ్చి వాటిని సురక్షిత ప్రదేశంలో ఉంచవలసిన బాధ్యత అప్పజెప్పి ప్రజల సురక్షిత ప్రయాణానికి సహాయపడతారని ఆశిద్దాం.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
          సామర్లకోట.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట